టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు కావటం దురదృష్టకరమని విమర్శించారు. ఇది అక్రమ అరెస్టు కాదు.. అనివార్యమైన అరెస్టు అన్నారు. కక్షసాధింపు చర్య అని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని.. అనేక కుంభకోణాల్లో సూత్రధారి చంద్రబాబు అని ఆరోపించారు. వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మంత్రి అంబటి దుయ్యబట్టారు. నేరాలకు పాల్పడే వారు ఏ స్థాయిలో ఉన్నా అరెస్టు చేయటం, కోర్టులో ప్రవేశపెట్టడం చట్టం ప్రకారం అవసరమని తెలిపారు. చంద్రబాబును అరెస్టు చేయకపోతే రాజ్యాంగాన్ని పూర్తిగా అమలుచేయనట్లు అవుతుందని అన్నారు.
Read Also: Kodali Nani: బాలకృష్ణపై కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు
అమరావతిలో అసైన్డ్ భూములు, ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ లో మార్పు వంటి అనేక కుంభకోణాలు చంద్రబాబు చేశారని మంత్రి అంబటి మండిపడ్డారు. ఈడీ, ఇంటెలిజెన్స్, సీఐడీ, ఐటీ అన్ని విచారణ సంస్థలు లోతుగా విచారణ చేశాయని తెలిపారు. ఈ స్కాంలలో ఉన్న పలువురిని విచారణ చేసిన తర్వాత అనేక విషయాలు బయటకు వచ్చాయని పేర్కొన్నారు. ఈ మొత్తం సమాచారంలో అసలు సూత్రధారి చంద్రబాబు అనే తేలిందని మంత్రి పేర్కొన్నారు. సీమెన్స్ కంపెనీకి ఈ కుంభకోణంతో సంబంధం లేదని.. సీమెన్స్ కంపెనీ కోర్టులో 164 నోటీసులో స్పష్టం చేశారని అంబటి అన్నారు. షెల్ కంపెనీల ద్వారా ప్రజాధనం లూటీ చేస్తే చంద్రబాబును అరెస్టు చేయకూడదా? అని ప్రశ్నించారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేస్తే సింపథీ వస్తుందని మాకు తెలియదా అన్నారు.
Read Also: Botsa Satyanarayana: చంద్రబాబు అరెస్ట్ రాజ్యాంగబద్ధంగా, చట్టపరంగా జరిగింది
ఎక్కడైనా ఒక ప్రైవేటు కంపెనీ ఒక ప్రభుత్వానికి మూడు వేల కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా ఇస్తుందా అని మంత్రి ప్రశ్నించారు. నాటి ఫైనాన్స్ కార్యదర్శి, సీఎస్ రూ.370 కోట్ల ప్రభుత్వ వాటా ఇవ్వకూడదని నోట్ ఫైల్ లో కూడా రాశారన్నారు. అయినా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒత్తిడితో నిధులు విడుదల అయ్యాయని అంబటి పేర్కొన్నారు. తన పీఏ శ్రీనివాస్, షాపూర్ జీ పల్లోంజి ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ విదేశాలకు పారిపోవటం వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ కు ఈ కుంభకోణం వివరాలు తెలుసా మంత్రి ప్రశ్నించారు. రోడ్ల మీదకు వచ్చి అవీ ఇవీ తగలేస్తే పవన్ కళ్యాణ్ వికృత ఆనందం పొందుతాడా అని దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్ జైలుకి వెళ్ళి చంద్రబాబుకు పూలబొకే ఇస్తాడా అని విమర్శలు చేశారు. అధికారులు వ్యతిరేకించి రాసిన నోట్ ఫైల్ ను మాయం చేశారని.. మా బావ గారు అవినీతి చేయలేదని చెప్పే ధైర్యం పురంధేశ్వరికి లేదని మంత్రి అంబటి పేర్కొన్నారు.