NVSS Prabhakar : నీతి ఆయోగ్ 10వ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనడాన్ని స్వాగతిస్తున్నట్లు బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు. అయితే 9వ సమావేశానికి హాజరుకాలేదని గుర్తుచేస్తూ, “అప్పుడు ముఖ్యమంత్రి ఎవరినిమిత్తం, ఎందుకోసం గైర్హాజరయ్యారు?” అనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు.
నీతి ఆయోగ్ సమావేశాల ఉద్దేశం రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్న దానిపై కేంద్రం నమ్మకం పెట్టుకున్నదని ఆయన అన్నారు. “రెవంత్ రెడ్డి ఫెడరల్ స్పూర్తితో సమావేశంలో పాల్గొనడం సానుకూల పరిణామం. కానీ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పాటించడం లేదు. కనీసం ఇప్పుడు అయినా వాటిని అమలు చేయాలని అధికార యంత్రాంగానికి సీఎం ఆదేశాలు ఇవ్వాలి,” అని సూచించారు.
Rajya Sabha Polls: జూన్ 19న రాజ్యసభ ఎన్నికలు.. పెరగనున్న ఇండియా కూటమి బలం
ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ పార్టీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. “పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని దోచిన బీఆర్ఎస్ ఇప్పుడు నీతి గురించి మాట్లాడడం విడ్డూరం. లిక్కర్ కేసులో జైలు నుంచి వచ్చి కవిత ఎవరికి నీతి పాఠాలు చెబుతోంది?” అంటూ ప్రశ్నించారు.
కుంభకోణాలకు సంబంధించి కేసీఆర్, కేటీఆర్లకు నోటీసులు వచ్చాయని, ఇవి రాజకీయ నోటీసులు కాకుండా అవినీతి ఆరోపణలపై విచారణ నోటీసులేనని స్పష్టం చేశారు. “కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా, ఎమ్మెల్యేగా విఫలమయ్యారు. కేటీఆర్ ఇప్పటికే అనేక విచారణలకు లోనవుతున్నారు. ఇదే సమయంలో హరీష్ రావు, కవిత వంటి నేతలు కూడా అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. అందుకే ఈ నేతలు తక్షణం తమ పదవులకు రాజీనామా చేయాలి,” అన్నారు.
ఈటల రాజేందర్కు వచ్చిన నోటీసులపై పార్టీ స్థాయిలో చర్చించి తదుపరి కార్యాచరణ చేపడతామని వెల్లడించారు. “ఈటలపై విచారణ జరుగుతుంది. ఈ విచారణలో బీఆర్ఎస్ నేతల అవినీతి ఆరోపణలు బట్టబయలవుతాయని మేము ఆశిస్తున్నాం,” అని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు. “లేఖ బయటకు వచ్చిందన్నదే కాదు.. డీల్ బయటపడినందుకే వాళ్లకు భయం,” అంటూ బీఆర్ఎస్ నేతలను మరోసారి విమర్శించారు.