తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ మెట్రో పొడిగించాలని ఆయన కోరారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖలో పేర్కొన్న విషయాలు: ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్(అబ్దుల్లాపూర్మెట్) వరకు మెట్రో లైన్ పొడిగింపు అవసరం ఉంది.. అలాలగే హైదరాబాద్ నగరం అటు వైపు వేగంగా విస్తరిస్తోంది.. ఎంతోమంది ప్రజలు హయత్ నగర్ నుంచి ఎల్బీనగర్ వరకు వెళ్లి.. అక్కడి నుంచి మెట్రోకు వెళ్తున్నారు. ప్రయాణికులకు చాలా కష్టంగా ఉంటోంది.. సాధారణ ప్రజలకు ముఖ్యంగా ఆఫీస్ లకు వెళ్లేవారికి చాలా అసౌకర్యం కలుగుతోంది అని అన్నారు. ఈ లైన్ ను పొడిగించే యోచన ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపడానికి ముందుకు రావడం లేదు అని వెంకట్ రెడ్డి అన్నారు.
Read Also: Unstoppable in OTT : ఓటీటీలోకి వచ్చేసిన ‘’వీజే సన్నీ’’ అన్ స్టాపబుల్
నగరంలో రోజురోజుకీ వాహనాల రద్దీ పెరుగుతోంది. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని ఎంపీ వెంకట్ రెడ్డి అన్నారు. రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.. పైగా, రోడ్ల నిర్వహణ సరిగ్గా ఉండడం లేదు.. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. ఈ మార్గంలోని జాతీయ రహదారి 65ను 6 లేన్లుగా కేంద్రం మారుస్తోంది.. రానున్న రోజుల్లో వాహనాల రద్దీ మరింత పెరుగుతుంది.. అప్పుడు ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్.. ఆ చుట్టుపక్కల ప్రజల ప్రయాణం మరింత దుర్భరంగా మారే ఛాన్స్ ఉంటుంది.. కాబట్టి మెట్రో విస్తరణ జరిగితే ప్రయాణికులు సొంత వాహనాల వాడకం తగ్గించే ఛాన్స్ ఉంది అని భువనగిరి ఎంపీ పేర్కొన్నారు.
Read Also: Cocaine: రికార్డు స్థాయిలో 5.3 టన్నుల కొకైన్ పట్టివేత.. విలువెంతో తెలిస్తే షాకవుతారు!
ఎల్బీనగర్-హయత్ నగర్ మార్గంలో మెట్రో విస్తరణపై కేంద్రం సానుకూలంగానే ఉందని ఎంపీ వెంకట్ రెడ్డి అన్నారు. కేంద్ర గృహనిర్మాణ- పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి హర్దీప్ పురికి గతంలో లేఖ రాశాను.. దీనిపై ఆయన స్పందించి రాష్ట్ర మున్సిపల్ శాఖకు ఫార్వార్డ్ చేశారు అని తెలిపారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి.. కేంద్రానికి నేను రాసిన లేఖను, రాష్ట్రప్రభుత్వానికి ఢిల్లీ నుంచి వచ్చిన లేఖను కూడా మీకు పంపుతున్నా.. ఈ విషయాన్ని పరిశీలించి వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని కోరుతున్నాను భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.