వాహనదారులకు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు గుడ్న్యూస్ చెప్పారు. అత్యవసర సేవలు అందించే అంబులెన్స్ల కోసం సహాయ చేసే వాహనదారులకు జరిమానాలు రద్దు చేస్తామని ప్రకటించింది. ఎమర్జెన్సీ సమయంలో అంబులెన్స్లకు దారి ఇచ్చేందుకు వాహనదారులు రెడ్సిగ్నల్ జంప్ చేస్తున్నారు. అయితే అత్యవసర పరిస్థితుల్లో జరిమానాలు వేయడం సరికాదని వినతులు రావడంతో ఈ మేరకు పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై అలాంటి వాహనాలకు ఎలాంటి జరిమానాలు విధించబోమని పోలీస్ శాఖ స్పష్టం చేసింది.
ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఉన్న కెమెరాలు ఐదు సెకన్లకు ఒకసారి వాహనదారుల కదలికలు రికార్డ్ చేస్తాయి. అంబులెన్స్కు దారి ఇచ్చే సమయంలో సిగ్నల్ జంప్ చేసినట్టు గుర్తిస్తే ఇకపై ఫైన్ పడదు. ఒకవేళ పడినా మినహాయిస్తారు. ట్రాఫిక్ సిగ్నల్స్ అంబులెన్స్లను గుర్తించి రెడ్ లైట్ నుంచి గ్రీన్ లైట్లోకి మారేలా జియో ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. సిటీలో 80 అంబులెన్స్లకు జీపీఎస్ అమర్చామని ఆరోగ్య శాఖ పేర్కొంది. 100 మీటర్ల దూరంలో అంబులెన్స్ ఉన్నప్పటికీ సిగ్నల్స్ గుర్తిస్తాయని స్పష్టం చేసింది.
రహదారులపై ఏఐ సీసీటీవీ కెమెరాలు అమరుస్తామని పోలీసులు చెబుతున్నారు. సేఫ్ సిటీ ప్రాజెక్ట్ మూడో దశలో భాగంగా రైల్వేస్టేషన్లు, ఎయిర్ పోర్ట్, చిన్నస్వామి స్టేడియంలో 150 వాచ్ టవర్లు, 8 హై డెఫినేషన్ ఫేస్ రికగ్నిషన్ కెమెరాలు ఏర్పాటు చేస్తామని అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రకటించారు.