Russia-Ukraine War: ఆగ్నేయ ఉక్రెయిన్లోని విల్నియాన్స్క్ నగరంలోని ప్రసూతి ఆసుపత్రిపై బుధవారం రష్యా క్షిపణి దాడిలో నవజాత శిశువు మరణించినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. దాడి జరిగిన సమయంలో ప్రసవించిన మహిళ, శిశువు, డాక్టర్ రెండస్తుల భవనంలోని ప్రసూతి వార్డులో ఉందని.. ఆ వార్డు మొత్తం ధ్వంసమైందని అధికారులు వెల్లడించారు. ఈ దాడిలో డాక్టర్, తల్లి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని.. కానీ శిశువు మరణించిందని వెల్లడించారు. రాత్రి ఆ ప్రాంతంలో పొగ దృశ్యాలతో పాటు సహాయక చర్యలు చేపడుతున్న రెస్క్యూ సిబ్బంది ఫోటోలు వెలువడ్డాయని టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ పేర్కొంది.
US VISA: యూఎస్ను సందర్శించాలంటే వీసా కోసం1000 రోజులు ఆగాల్సిందే..!
ఉక్రెయిన్ అత్యవసర సేవా విభాగం పోస్ట్ చేసిన వీడియోలో సహాయక చర్యలు చేపడుతున్న సిబ్బంది వైద్యుడిలా కనిపించిన వ్యక్తికి తాగేందుకు నీరు ఇస్తున్నట్లు చూపబడింది. ఈ క్షిపణి దాడిపై విల్నియాన్స్క్తో సహా జాపోరిజ్జియా ప్రాంత గవర్నర్ ఒలెక్సాండర్ స్టారుఖ్ టెలిగ్రామ్లో స్పందించారు. ఈ దాడి వల్ల అప్పుడే పుట్టిన పసిగుడ్డు ప్రాణాలు కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రష్యా ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం. ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయ అధిపతి ఆండ్రీ యెర్మాక్ టెలిగ్రామ్ పోస్ట్లో దాడిని ఖండించారు. ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై దాడి చేసిన రష్యా దళాలను ఉగ్రవాదులుగా ప్రస్తావిస్తూ.. ప్రతి ఉక్రేనియన్ జీవితానికి రష్యా బాధ్యత వహిస్తుందని అన్నారు.