AP Ministers Ratings: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశం మొదటి రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రుల పనితీరుపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా శాఖలలో ఫైళ్ల క్లియరెన్స్ ఎంత వేగంగా జరుగుతోందనే అంశంపై ఆయన మంత్రులకు రేటింగ్స్ ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీఎం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మొదటి స్థానంలో నిలిచారు.
మంత్రి అచ్చెన్నాయుడు తర్వాతి స్థానాల్లో వరుసగా కింజరాపు రామ్ మోహన్ నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ నిలిచారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాలుగో స్థానంలో ఉండడం విశేషం. మరోవైపు మంత్రి వంగలపూడి అనిత చివరి స్థానంలో ఉన్నారు. మంత్రులు ఫైళ్లను క్లియర్ చేయడానికి ఎంత సమయం తీసుకుంటున్నారో వివరంగా ప్రస్తావించిన సీఎం చంద్రబాబు.. ప్రభుత్వ పనులు వేగంగా పూర్తయ్యేలా ఫైళ్ల క్లియరెన్స్ త్వరగా జరగాలని సూచించారు. పరిపాలనలో వేగం పెంచడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.
Also Read: AP Gram Panchayats: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన!
ఇక కలెక్టర్ల సమావేశం రెండో రోజు కూడా కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖపై ప్రత్యేక ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అలాగే ఆదాయార్జనకు సంబంధించిన శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. దీనితో పాటు విద్యా రంగం, ఉపాధి అవకాశాలపై కూడా సమావేశంలో చర్చ జరగనుంది. కోర్టు కేసులు, న్యాయ శాఖ పరిధిలో ఉన్న అంశాలపై కూడా అధికారులు వివరాలు సమర్పించనున్నారు. ఈరోజు సాయంత్రం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై కూడా సీఎం ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు. కలెక్టర్లు, ఎస్పీలతో ఈ సమీక్ష జరగనుండగా.. రాష్ట్రంలో చట్టవ్యవస్థను మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించనున్నారు.
