Tirumala: తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాట్లపై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. తిరుమల ఏర్పాట్ల గురించి ఉన్నతాధికారులు డీజీపీకి వివరించారు. ఈ సమావేశంలో
డీఐజీలు రాజశేఖర్ బాబు, రవిప్రకాష్, ఎస్పీలు పరమేశ్వర్ రెడ్డి, తిరుమలేశ్వర రెడ్డి, సీవీయస్వో నరసింహ కిషోర్లు పాల్గొన్నారు. తిరుమలలో 15 వేల వాహనాలకు పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశామని తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి డీజీపీకి వివరించారు. చిన్నపిల్లలు తప్పిపోకుండా జియో ట్యాగింగ్ చేస్తామన్నారు.
Also Read: Janasena: టీడీపీతో జనసేన సమన్వయ కమిటీ.. అధ్యక్షుడిగా నాదెండ్ల మనోహర్
బ్రహ్మోత్సవాల సమయంలో నాలుగు అంశాలపై భద్రతా సిబ్బంది దృష్టి సారించాలని డీఐజీ రవిప్రకాష్ తెలిపారు. క్రౌడ్ మేనేజ్మేంట్, ట్రాఫిక్ మేనేజ్మేంట్, వీఐపీల భద్రత, భక్తుల భద్రతపై దృష్టి సారించాలన్నారు. భక్తుల పట్ల మర్యాదగా ప్రవర్తించడంతో పాటు వారిని గైడ్ చేయాలన్నారు. మాడవీధులు, ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు వద్ద భద్రతా ఏర్పాట్లను నిరంతరాయంగా పర్యవేక్షించాలని తెలిపారు.
Also Read: Pawan Kalyan: ద్వేషంతో కూడుకున్న వాదనలు, వ్యక్తులు కాల గర్భంలో కలిసిపోతారు..
సమీక్ష అనంతరం డీజీపీ మీడియాతో మాట్లాడారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి తెలిపారు. 6 మంది ఎస్పీలతో సహా 4900 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగితే తిరుపతిలోనే ట్రాఫిక్ నియంత్రణ చేస్తామన్నారు. తిరుపతిలో మూడు ప్రాంతాలలో పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నామని వెల్లడించారు. నాలుగు మాడ వీధులలో ప్రత్యేకంగా భద్రతా ఏర్పాట్లు చేశామని వివరించారు. దొంగతనాలను అరికట్టడానికి ప్రత్యేకంగా క్రైం టీంలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇద్దరు డీఐజీలు నిరంతరాయంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తారన్నారు. భద్రతా ఏర్పాట్ల కోసం డ్రోన్ కెమరాలు వినియోగిస్తామని డీజీపీ స్పష్టం చేశారు.