NTV Telugu Site icon

CM YS Jagan: మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు.. సీఎం జగన్‌ స్పందన ఇదే..

Ys Jagan

Ys Jagan

CM YS Jagan: మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై కీలక ముందడుగు వేసింది ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్‌.. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా రిజర్వేషన్‌ బిల్లు లోక్‌సభ ముందుకు వచ్చింది. సోమవారం సాయంత్రం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ ఈ బిల్లుకు ఆమోదం తెలిపిన విషయం విదితమే కాగా.. ఈ రోజు ఈ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్ మేఘ్వాల్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. నారీ శక్తి వందన్‌ అభియాన్‌ పేరుతో కేంద్రం ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అయితే దీనిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.. ఇక, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లుపై స్పందించిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. బిల్లును స్వాగతిస్తూ ట్వీట్ చేశారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వటానికి గర్విస్తున్నాను అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు సీఎం వైఎస్‌ జగన్‌.. మాకు అత్యంత ప్రాధాన్యత అంశం మహిళా సాధికారత.. గత నాలుగేళ్లుగా సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, సమాన ప్రాతినిధ్యం ద్వారా మహిళా సాధికారత సాధించామని.. మరింత ఉజ్వలం భవిష్యత్తు, మరింత సమానత్వం సాధిద్ధాం అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌.

మరోవైపు ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వైసీపీ పూర్తిగా మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. మహిళా కోసం జగన్ అనేక పథకాలు ప్రవేశ పెట్టారు. మహిళలకు నామినేటెడ్ , స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు అయ్యేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. అయితే, మహిళా రిజర్వేషన్ బిల్లు త్వరగా అమలు అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై అధ్యయనం చేసి బిల్లు త్వరగా అమలు అయ్యేలా చూస్తామని.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్ సభలో 6 గంటల పాటు చర్చ ఉంటుందన్నారు. అంశాలపై విభేదాలు రావచ్చు ఏమో కానీ అన్ని పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలుపుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి.