Cheetah Movement in Tirumala: తిరుమలలో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. ఇటీవల చిరుత సంచారం బోనులో చిక్కిన ఘటన మరువరక ముందే తిరుమల మొదటి ఘాట్ రోడ్డు ఎలిపేంట్ ఆర్చీ వద్ద మరో చిరుత సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. శ్రీవారి మెట్ల మార్గంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమరాలో చిరుత సంచారం గుర్తించిన అధికారులు భక్తులను అప్రమత్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తిరుమల స్పెషల్ కాటేజీల సమీపంలో ఎలుగుబంటి తిరుగుతున్న దృశ్యాలు మరో ట్రాప్ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో, ఆ సమీప ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్దమవుతున్నారు.
కాగా, గత వారం రోజుల వ్యవధిలోనే రెండు చిరుతలు చిక్కాయి.. నాలుగు రోజుల క్రితం ఓ చిరుత బోనులో చిక్కిన విషయం విదితమే కాగా.. మరో చిరుతను నిన్న అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఇటీవల అలిపిరి కాలినడక మార్గంలో చిరుత దాడి చేయడంతో నెల్లూరు జిల్లాకు చెందిన ఆరేళ్ల బాలిక లక్షిత మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. నడక మార్గంలో వెళ్లేందుకు భయంతో వణికిపోతున్నారు. అప్రమత్తమైన టీటీడీ అధికారులు.. అటవీశాఖ అధికారుల సహాయంతో ఆపరేషన్ చిరుత పేరుతో చిరుతలను బంధించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.. దాని కోసం చిరుతల సంచారాన్ని గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్న విషయం విదితమే కాగా.. ఆ కెమెరాల్లో చిరుతల సంచారానికి సంబంధించిన దృశ్యాలు చిక్కుతున్నాయి.
ఇక, తెలుగు రాష్ట్రాల్లో చిరుతలు..వరుసగా భయపెడుతున్నాయ్. తిరుమలలో ఇప్పటికే రెండు చిరుతలను బంధించారు. తిరుమల, తిరుపతి, కర్నూలులో మరచిపోకముందే.. నిర్మల్ జిల్లాలో చిరుల సంచారం కలకలం రేపుతోంది. నిర్మల్ పార్క్ ఏరియాలో రాత్రి వేళల్లో చిరుత పులి సంచరిస్తోంది. ఇప్పటికే నందిగుండం శివారు ప్రాంతంలో చిరుత దాడిలో ఓ ఆవు మృతి చెందింది. మొన్న రాత్రి నిర్మల్లోని.. విశ్వనాథ్ పేట, బంగల్ పేట మార్గంలో చిరుత పులి స్థానికులకు కనిపించింది. ఆ తర్వాత నంది గుండం దుర్గామాత ఆలయం సమీపంలో చిరుత పులిని స్థానికులు చూశారు. చిరుత పులి సంచారంతో నిర్మల్లోని.. గాంధీచౌక్, బంగల్ పేట్, విశ్వనాథ్ పేట్, పాతబస్తీ వాసులు భయాందోళనల్లో ఉన్నారు. నిర్మల్లో బేస్ క్యాంప్ ఏర్పాటు చేసిన అటవీశాఖ సిబ్బంది.. పార్క్ ఏరియాలో చిరుత సంచరించినట్లు నిర్ధారించారు. చిరుత పులిని బంధించేందుకు కెమెరా ట్రాప్స్ ఏర్పాటు చేశారు. మరోవైపు చిరుత సంచారంతో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మైక్లలో అనౌన్స్ చేయిస్తున్నారు మున్సిపల్ అధికారులు. చిరుత సంచరిస్తున్న ప్రాంతాల వైపు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట పోలాల్లోకి వెళ్లాలంటేనే అన్నదాతలు వణికిపోతున్నారు. అటవీ అధికారులు…చిరుతను బంధించి అడవిలో వదిలేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.