NTV Telugu Site icon

AP Assembly: సభలో మీసాలు మెలేసిన బాలకృష్ణ.. సభలో ఉద్రిక్తత.. అసెంబ్లీ వాయిదా

Balakrishna

Balakrishna

AP Assembly: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.. సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు.. చంద్రబాబు అరెస్టు అక్రమం అంటూ వాయిదా తీర్మానం ఇచ్చిన టీడీపీ సభ్యులు.. స్పీకర్‌ పోడియం దగ్గర ఆందోళనకు దిగారు.. ప్లకార్డులతో సభలో నినాదాలు చేశారు.. జై డెమోక్రసీ అంటూ నినదించారు టీడీపీ సభ్యులు.. వాయిదా తీర్మానంపై చర్చ కోసం పట్టుబట్టారు.. స్పీకర్ పోడియం ఎక్కి నినాదాలు చేశారు.. స్పీకర్ పై కాగితాలు చింపి వేశారు టీడీపీ సభ్యులు.. స్పీకర్ టేబుల్ పై ఉన్న మైక్, ఇతర వస్తువులను ధ్వంసం చేసే ప్రయత్నం చేసే ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. టీడీపీ ఎమ్మెల్యేల వైఖరిని తప్పుపడుతూ ముందుకు వచ్చారు వైసీపీ ఎమ్మెల్యేలు సుధాకర్ బాబు, బియ్యపు మధుసూదన్ రెడ్డి.. స్పీకర్‌ పోడియం దగ్గరకు టీడీపీ, వైసీపీ సభ్యులు పోటాపోటీగా రావడంతో.. వారిని వారించిన స్పీకర్.. సహనం పాటించాలని కోరారు.. టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వివాదంతో సభలో గందరగోళం నెలకొంది.

Read Also: Ambati Rambabu: అసెంబ్లీ వేదికగా టీడీపీ నేతలు తప్పును ఒప్పుకోండి..

మరోవైపు.. అసెంబ్లీలో మీసాలు మెలేశారు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. దీనికి ప్రతిగా బియ్యపు మధు తొడగొట్టారు.. ఇక, బాలయ్య మీసాలు మెలేయడంపై స్పందించిన మంత్రి అంబటి రాంబాబు.. సినిమాల్లో మీసాలు మెలేయండి ఇక్కడ కాదు అంటూ కౌంటర్‌ ఇచ్చారు.. స్పీకర్ పోడియం ముందుకు టీడీపీ, వైసీపీ సభ్యులు దూసుకెళ్లడంతో.. లేచి నిలబడి దండం పెట్టిన స్పీకర్ తమ్మినేని సీతారాం.. వైసీపీ సభ్యులను వెనక్కి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.. అయినా సభలో ఆందోళన కొనసాగడంతో.. అసెంబ్లీని వాయిదా వేశారు.. ఇక, స్కిల్‌ స్కాంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు మంత్రి బుగ్గన.. చంద్రబాబు అరెస్ట్‌ చర్చపై బీఏసీలో నిర్ణయం తీసుకుంటాం అన్నారు. ప్రతిసారి అర్థంపర్థంలేని వాయిదా తీర్మానం ఇచ్చి సభను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం వేసే ప్రశ్నలకు టీడీపీ వాళ్ల దగ్గర సమాధానం ఉందా? అని నిలదీశారు మంత్రి బుగ్గన. మరోవైపు.. టీడీపీ సభ్యులతో పాటు పోడియం ఎక్కి ఆందోళన చేశారు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి.. ఆ మధ్యే ఆమె వైసీపీకి గుడ్‌బై చెప్పిన విషయం విదితమే.