మేడారం మహా జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. చిలుకల గుట్టనుంచి కుంకుమ భరణి రూపంలో బయల్దేరి వచ్చిన సమ్మక్క.. గద్దెకు చేరుకుంది. సమ్మక్కను ప్రధాన పూజారి ప్రతిష్టించారు. సమ్మక్కను గద్దెపై ప్రతిష్టించే సమయంలో లైట్లు నిలిపివేశారు. మరోవైపు.. అమ్మవారిని గద్దెపై ప్రతిష్టించే సమయంలో భక్తుల దర్శనాన్ని నిలిపివేశారు. సమ్మక్కను గద్దెపై ప్రతిష్టించడంతో భారీ ఎత్తున భక్తులు జై సమ్మక్క తల్లి-జై సారక్క తల్లి అంటూ నినాదాలు చేశారు. ఇదిలా ఉంటే.. బుధవారం కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెకు చేరుకుంది. పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు గద్దెలకు చేరుకుని.. భక్త జనులకు దర్శనమిస్తున్నారు. రేపు (శుక్రవారం) ఒక్కరోజు అమ్మవార్లు గద్దెలపై ఉంచనున్నారు. రేపు భక్తుల దర్శనం అనంతరం శనివారం మళ్లీ సమ్మక్క వనంలోకి వెళ్లనుంది.
PM Modi: మరిన్ని రైల్వేస్టేషన్ల అభివృద్ధికి మోడీ శ్రీకారం.. తెలంగాణలో ఇవే..!
కాగా, మేడారం జాతర భక్తులతో కిటకిటలాడుతోంది. జై సమ్మక్క అంటూ మేడారం పరిసరాలు మార్మోగిపోతున్నాయి. పెద్ద ఎత్తున వచ్చిన భక్తులతో మేడారం కిక్కిరిసిపోతున్నది. సమ్మక్క-సారలమ్మ నామస్మరణలతో వనం పులకరించిపోతున్నది. సమ్మక్క రాక సందర్భంగా మేడారంలోని ఆమె గుడిని శుద్ధి చేశారు. మామిడి తోరణాలు కట్టారు. ఆవరణ మొత్తం ఎర్రమన్నుతో అలికి, ముగ్గులు పెట్టారు. అమ్మవారికి మంత్రులు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. సమ్మక్క ఆగమనం సందర్భంగా తల్లి గౌరవార్థం జిల్లా ఎస్పీ మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. కోయలు ప్రత్యేక పూజలు, ఆటల పాటలతో స్వాగతం పలికారు. కాగా.. ఇప్పటికే సారమ్మను ఆదివాసీ పూజారులు కొమ్మ బూరలు ఊదుతూ, డోలు వాయిద్యాలతో గద్దెపై ప్రతిష్టించారు. పగిడిద్దరాజు, గోవిందరాజులు సైతం గద్దెలపై కొలువుదీరారు. చివరగా సమక్క రాకతో జాతరలో కీలక ఘట్టం పూర్తైంది. సమక్క గద్దెపైకి చేరడంతో భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. నాలుగు రోజుల పాటు జరిగే మేడారం మహాజాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మరోవైపు రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి భక్తులు రావడం పరిపాటిగా మారింది.
ఇక్కడికి వచ్చిన భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవార్ల గద్దెలను దర్శించుకొంటున్నారు. ఇప్పటికే గద్దెల దగ్గర భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిపోయింది. మేడారం పరిసర ప్రాంతాలు గూడారాలతో నిండుకున్నాయి.
Top Headlines @ 9 PM : టాప్ న్యూస్