తిరుమల నడకదారిలో మరో సారి చిరుత పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. గత ఏడాది తిరుమల కాలి నడక మార్గంలో చిరుత దాడిలో చిన్నారి లక్షిత ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇక, ఈ ఘటనతో తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ ) అధికారులు అలర్ట్ అయ్యారు. నడక మార్గంలో చిరుత సంచరించే ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి చిరుత పులులను బందిస్తున్నారు. అయితే, కాలి నడకన తిరుమల వెళ్లే భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని గుంపులు గుంపులుగా ఏర్పాటు చేసి వారి చేతికి ఊత కర్రలను అందించి మెట్లు మార్గంలోకి టీటీడీ అనుమతి ఇస్తుంది. ఈ నేపథ్యంలో మరో సారి చిరుత సంచరించడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.
Read Also: Game Changer : ‘గేమ్ చేంజర్ ‘ రిలీజ్ డేట్ ఫిక్స్?..శంకర్ ప్లాన్ మాములుగా లేదు…
ఈనెల 26వ తేదీ వేకువ అర్థరాత్రి 12 గంటల సమయంలోట్రాప్ కెమెరాలకు చిరుత పులి కదలికలు చిక్కడంతో మరోసారి భద్రతా సిబ్బందిని టీటీడీ అలర్ట్ చేసింది. తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.. చిరుతను పట్టుకోవడానికి ప్రత్యేకంగా బోన్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే అటవీ శాఖ అధికారులు నాలుగు చిరుతలను పట్టుకుని ఎస్వీ జూపార్క్ లో ఉంచారు. అటవీ విస్తీర్ణం తక్కువగా ఉండటంతో చిరుతలు తిరుమల కొండకు చేరుకుంటున్నాయని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు.