మహిళా ఇన్స్పెక్టర్తో ఓ బడా వ్యాపారవేత్త వాగ్వాదానికి పాల్పడ్డ ఘటన మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో చోటు చేసుకుంది. నిబంధనలు ఉల్లంఘించి పోలీసులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. కాగా.. మహిళా సబ్ఇన్స్పెక్టర్, వ్యాపారవేత్త మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో ఆధారంగా పోలీసులు అతనిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
నిజానికి.. లోక్సభ ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలో ప్రవర్తనా నియమావళి అమలులో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు నగరంలోని ఎంట్రీ పాయింట్లు, కూడళ్లలో తనిఖీలు చేస్తున్నారు. అందులో భాగంగా.. ఝాన్సీ రోడ్ పోలీస్ స్టేషన్ కు సంబంధించిన మహిళా ఎస్సై సోనమ్ పరాశర్ తనిఖీ చేస్తుంది. ఈ క్రమంలో.. నగరంలోని వివేకానంద కూడలిలో వాహనాల తనిఖీలు చేస్తుండగా.. ఓ లగ్జరీ కారును ఆపారు.
ఈ క్రమంలో.. ఎస్సై సోనమ్ పరాశర్ వ్యాపారవేత్త కారుపై ఉన్న చలాన్లు కట్టాలని, హారన్ ను తొలగించాలని కోరింది. దీంతో.. వ్యాపారవేత్త ఎస్ఐని వేధించ సాగాడు. మహిళా ఎస్ఐతో అసభ్యంగా ప్రవర్తించాడు. “హారన్ ని తొలగించడం గానీ, చలాన్ కట్టడం గానీ చేయను, నా కారు నంబర్ను ఎస్పీకి చెప్పండి. కావాలంటే తను నాతో మాట్లాడండి” అన్నాడు. కాగా.. ఘటనా స్థలంలో ఉన్న పోలీసు సిబ్బంది ఈ ఘటనను వీడియో తీశారు.
మహిళా ఎస్ఐ సోనమ్ పరాశర్ను వ్యాపారవేత్త ముఖేష్ అగర్వాల్ ఎలా బెదిరించాడో మొత్తం రికార్డ్ చేశారు. అలాగే ముఖంపై వేలు పెట్టేందుకు ప్రయత్నించారు. దీంతో మహిళా ఎస్ఐ నిరసన వ్యక్తం చేసింది. దాదాపు 15 నిమిషాల పాటు సదరు వ్యాపారి మహిళా ఇన్స్పెక్టర్పై ఆధిపత్యం కొనసాగించాడు. ఆ తర్వాత పోలీసులను బెదిరించి ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో విషయం పోలీసు ఉన్నతాధికారులకు చేరింది. వ్యాపారిపై చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఏఎస్పీ షియాజ్ కేఎం మాట్లాడుతూ.. చట్టాన్ని ఉల్లంఘించే వారితో, పోలీసులతో ఇలాంటి దుర్మార్గంగా ప్రవర్తిస్తే సహించేది లేదన్నారు.