Zomato, Swiggy: ఫుడ్ డెలివరీ ప్లాట్ఫారమ్స్ అయిన స్విగ్గీ, జొమాటోలు వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. వర్షాకాలం కోసం కొత్త నియమాలను తీసుకువచ్చాయి. ఇకపై వర్షం సమయంలో, బ్యాడ్ వెదర్ ఉన్న సమయంలో ఫుడ్ డెలివరీ చేయాలంటే సబ్స్క్రిప్షన్ వినియోగదారుడు కూడా అదనంగా ఛార్జీలు చెల్లించాల్సిందే. సాధారణ యూజర్లతో సహా, సబ్స్క్రిప్షన్ కలిగిన వినియోగదారులను కూడా ఇకపై ఒకే విధంగా ట్రీట్ చేయనున్నాయి.
స్విగ్గీ తర్వాత, దాని ప్రత్యర్థి అయిన జొమాటో కూడా వర్షాకాలం కోసం దాని గోల్డ్ సబ్స్క్రిప్షన్ ప్రయోజనాల్లో కొత్త మార్పుల్ని తీసుకువచ్చింది. శుక్రవారం నుంచి, వర్షాకాలంలో గోల్డ్ సభ్యులకు సర్జ్ ఫీజుల నుంచి మినహాయింపును తీసేసింది. అంటే, వర్షం పడుతున్నప్పుడు ఫుడ్ డెలివరీకి వినియోగదారులు అదనపు రసుము చెల్లించాల్సి ఉంటుంది. యాప్లో నోటిఫికేషన్ ద్వారా కంపెనీ ఈ మార్పు గురించి వినియోగదారులకు తెలియజేసింది. “మే 16 నుండి, వర్షాల సమయంలో సర్జ్ ఫీజు మినహాయింపు మీ గోల్డ్ ప్రయోజనాలలో భాగం కాదు” అని మెసేజ్ ద్వారా వెల్లడించింది.
Read Also: CM Revanth Reddy: హైదరాబాద్లో ప్రయోగాత్మకంగా స్మార్ట్ పోల్స్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
అయితే, ఈ సర్జ్ ఫీజ్ కి సంబంధించిన ఖచ్చితమైన మొత్తాన్ని జొమాటో తెలియజేయలేదు. క్లిష్ట వాతావరణ పరిస్థితుల్లో పనిచేసే డెలివరీ భాగస్వాములకు మెరుగైన పరిహారం అందించడానికి ఈ అదనపు ఛార్జీ కంపెనీకి సహాయపడుతుందని జొమాటో వివరించింది. ఇప్పటికే జొమాటో తన భాగస్వామ్య రెస్టారెంట్లతో 50:50 రీఫండ్-షేరింగ్ విధానాన్ని నిలిపివేసిన తర్వాత ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.
ఇప్పటికే, జొమాటో ప్రత్యర్థి స్విగ్గీ కూడా తన స్విగ్గీ వన్ సభ్యత్వం కలిగిన యూజర్లతో సహా మిగతా వినియోగదారుల నుంచి వర్షాకాల రసుమును వసూలు చేస్తుంది. అన్ని ఫుడ్ డెలివరీ ప్లాట్ఫారమ్స్ కూడా ఇలాంటి ఛార్జీలను త్వరలో వసూలు చేసే అవకాశం కనిపిస్తోంది. గతంలో, జొమాటో తన గోల్డ్ సభ్యత్వం కలిగిన యూజర్లకు ఉచిత డెలివరీ, వర్షం సమయంలో సర్జ్ ఫీజులను వసూలు చేయలేదు. ఇప్పుడు కొత్త నియమంతో బ్యాడ్ వెదర్ పరిస్థితుల్లో సాధారణ వినియోగదారులతో పాటు గోల్డ్ సభ్యులనను కూడా ఒకే విధంగ చూస్తామని చెప్పింది. జొమాటో గోల్డ్ ఇప్పటికీ కొన్ని కీలక ప్రయోజనాలను అందిస్తుంది, వాటిలో సమీపంలోని భాగస్వామి రెస్టారెంట్ల నుండి (7 కి.మీ. లోపల) ఉచిత డెలివరీ, డైనింగ్ ఔట్ చేయడంపై 30 శాతం వరకు తగ్గింపులు ఉన్నాయి.