CM Revanth Reddy: విద్యుత్ శాఖపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది అత్యధికంగా 17,162 మెగావాట్లకు విద్యుత్ డిమాండ్ చేరుకుందని సీఎంకి అధికారులు వివరించారు. గత ఏడాదితో పోల్చితే విద్యుత్ డిమాండ్ 9.8 శాతం పెరిగింది అన్నారు. 2025-26లో 18,138 మెగావాట్లకు డిమాండ్ పెరుగుతుంది అని అంచనా వేశారు. 2034-35 నాటికి 31,808 మెగావాట్లకు విద్యుత్ డిమాండ్ చేరుకుంటుంది అని పేర్కొన్నారు. ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నట్లు ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు.
Read Also: CISF: ఇంటర్ పాసయ్యారా? హెడ్కానిస్టేబుల్ జాబ్స్ మీకోసమే.. ఈజీగా జాబ్ కొట్టే ఛాన్స్!
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే మూడేళ్లలో ప్రభుత్వం తీసుకువచ్చే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వల్ల విద్యుత్ డిమాండ్ పెరుగుతుంది అన్నారు. విద్యుత్ అవసరాల కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో నిర్మించే నీటిపారుదల ప్రాజెక్టుల విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలి.. రైల్వే లైన్లు, మెట్రో, ఇతర మాస్ ట్రాన్స్ పోర్టులకు విద్యుత్ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలి అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఇతర కార్పొరేషన్లలో విద్యుత్ అవసరాలను లెక్కలోకి తీసుకోవాలి.. కొత్తగా ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్లు, పారిశ్రామిక వాడలకు కావాల్సిన విద్యుత్ ను దృష్టిలో పెట్టుకుని ముందుకు కొనసాగాలని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో హైదరాబాద్ డేటా సెంటర్ల హబ్ గా మారబోతుంది.. హైదరాబాద్ లో డేటా సిటీ ఏర్పాటు చేయబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు.
Read Also: KTR: అది మీరు చేయగలరా.. కొండా సురేఖకు కేటీఆర్ కౌంటర్
అయితే, రీజనల్ రింగ్ రోడ్డు పరిధిలో నిర్మించే రేడియల్ రోడ్లు, శాటిలైట్ టౌన్ షిప్ లకు కావాల్సిన విద్యుత్ అవసరాలపైన హెచ్ఎండీఎతో సమన్వయం చేసుకోవాలని సీఎం రేవంత్ పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా సబ్ స్టేషన్లను అప్ గ్రేడ్ చేసుకోవాలన్నారు. విద్యుత్ లైన్ల ఆధునీకరణ పైనా దృష్టి సారించాలి.. ఫ్యూచర్ సీటీలో పూర్తి భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు. ఫ్యూచర్ సిటీలో విద్యుత్ టవర్లు, పోల్స్, లైన్స్ బహిరంగంగా కనిపించడానికి వీలులేదు.. హై టెన్షన్ లైన్లను కూడా అక్కడి నుంచి తరలించాల్సి ఉంటుంది అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్మార్ట్ పోల్స్ ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే, సెక్రటెరియట్, నెక్లస్ రోడ్, కేబీఆర్ పార్కు లాంటి ప్రాంతాల్లో స్మార్ట్ పోల్స్ ను అందుబాటులోకి తీసుకు రావాలని రేవంత్ రెడ్డి వెల్లడించారు.