దేశంలో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయని ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా అన్నారు. భారత్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో తెలంగాణ సీఎం కేసీఆర్ సవివరంగా చెప్పారని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రజాచైతన్యాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నట్లు చెప్పారు. చాలా రోజులుగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని చెప్పారు. దేశంలో పరిస్థితులు దిగజారుతుంటే చూస్తూ ఉండలేమని అన్నారు. హైదరాబాద్లోని జలవిహార్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తెరాస సంపూర్ణ మద్దతు ఇస్తున్నందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
BJP V/s TRS: ముచ్చటగా మూడోసారి.. ప్రధానిని ఆహ్వానించేందుకు కేసీఆర్ గైర్హాజరు
రాష్ట్రపతి ఎన్నికలు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే పోరాటమో, ఇద్దరు వ్యక్తుల గుర్తింపు కోసం జరిగే పోరాటమో కాదని చెప్పారు. ఇది విశాల భారత పరిరక్షణ కోసం జరిగే పోరాటమని అన్నారు. విద్వేషపూరిత ప్రసంగాలు సమాజానికి మంచివి కాదన్నారు. ఒక వ్యక్తి చెబుతుంటే 135 కోట్ల మంది వినాలా..? ఇదేనా ప్రజాస్వామ్యం అంటూ యశ్వంత్ సిన్హా ప్రశ్నించారు. రాష్ట్రపతి ఎన్నిక తర్వాత కూడా పోరాటం కొనసాగుతుందన్నారు. దేశానికి కేసీఆర్ వంటి నేత అవసరమని ఆయన అన్నారు. ఢిల్లీకి వచ్చే యువనేత కేటీఆర్ తనకు మద్దతు ప్రకటించారని వెల్లడించారు. కేసీఆర్తో మరోసారి సమావేశమవుతానని ఆయన చెప్పారు.