కరోనా మహమ్మారి ప్రపంచాన్ని మార్చేసింది. తప్పనిసరిగా ఆఫీస్కి వెళ్లి పనిచేసే ఉద్యోగులు కూడా కరోనా కారణంగా ఇంటినుంచే పనిచేయడం మొదలుపెట్టారు. ఎవరూ కూడా ఇంటి నుంచి బయటకు కదలడంలేదు. ఒకప్పుడు ఐటి రంగానికే పరిమితమైన ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు దాదాపుగా అన్ని రంగాలకు పాకింది. ఉపాద్యాయులు, ఉద్యోగులు అందరూ ఇంటి నుంచే పనిచేస్తున్నారు. వర్చువల్ విధానం ద్వారా పనిచేస్తున్నారు. మనదేశంలో కూడా ప్రస్తుతం ఇలానే జరుగుతున్నది. మంత్రుల సమావేశాలు, పాలనా పరమైన విధానాలు కూడా వర్చువల్ విధానంలోనే జరుగుతున్నది. అయితే, ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలను కూడా వర్చువల్ విధానంలోనే జరిపేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దేశంలో కరోనా మహమ్మారి విజృంభణతో వివిధ రాష్ట్రాల నుంచి పార్లమెంట్ సభ్యులు ఢిల్లీకి రావడం అంటే కుదరని పని. ఒకవేళ సమావేశాలు ఏర్పాటు చేస్తే వందలాది మంది ఒకే చోట గుమిగూడతారు. ఈ సమయంలో అది కరెక్ట్ కాదు. ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాల్లో వర్చువల్ విధానం ద్వారానే పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మనదేశం కూడా ఆ దిశగా అడుగులు వేసేందుకు ప్రయత్నం మొదలుపెట్టింది.