Gurpatwant Singh Pannun: ఖలిస్తానీ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్(ఎస్జేఎఫ్) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూను హతమార్చేందుకు పన్నిన కుట్రను అమెరికా భగ్నం చేసినట్లు ఓ అధికారి చెప్పినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ బుధవారం నివేదించింది. పన్నూను హత్య చేసేందుకు న్యూఢిల్లీ ప్లాన్ చేసిందని, భారతదేశం ప్రయేయంపై అమెరికా హెచ్చరిక జారీ చేసిందని కూడా వార్తా పత్రిక నివేదించింది. అమెరికా పౌరసత్వం ఉన్న పన్నూను అమెరికా గడ్డపైనే హతమార్చేందుకు కుట్ర చేసినట్లు వార్తాపత్రిక నివేదించింది.
ఖలిస్తాన్ ఉద్యమానికి సపోర్టు చేస్తున్న పన్నూని భారతదేశం ఉగ్రవాదిగా గుర్తించింది. యూస్లో ఖలిస్తాన్ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. అతను నిర్వహిస్తున్న ‘సిఖ్ ఫర్ జస్టిస్’ సంస్థను కూడా భారత్ ఉగ్రసంస్థగా ప్రకటించింది. అయితే ఈ కుట్ర గురించి యూఎస్ అధికారులు హెచ్చరించారా..? లేదా..? అనే విషయాన్ని చెప్పడానికి పన్నూ నిరాకరించినట్లు సదరు పత్రిక చెప్పింది. భారత్ నుంచి అమెరికన్ గడ్డపై నా ప్రాణాలకు ముప్పు ఉన్న విషయంపై యూఎస్ ప్రభుత్వం ప్రతిస్పందించనివ్వండి అని పన్నూ చెప్పాడని నివేదించింది.
Read Also: GVL Narasimha Rao: కమ్యూనిష్టులు దాదాపు కనుమరుగయ్యారు.. సీపీఐ, సీపీఎంలు పిట్ట పార్టీలు
ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో భారత్ వ్యతిరేకి, కెనడాలో ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతుగా ఉంటున్న గురుపత్వంత్ సింగ్ పన్నూను ఆ దేశంలోనే గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. ఈ ఘటన కెనడా, ఇండియా దేశాల మధ్య దౌత్యవివాదంగా మారింది. ఈ ఘటనలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించిన కొన్ని వారాల తర్వాత, పన్నూ హత్యకు భారత్ ప్లాన్ చేసిందని ఫైనాన్షియల్ టైమ్స్ వార్తా కథనాన్ని ప్రచురించింది. అయితే గతంలో ట్రూడో చేసిన ఆరోపణల్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఇది కెనడా అసంబద్ధ, రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలుగా కొట్టిపారేసింది.
పన్నూ గత కొంత కాలంగా అమెరికా, కెనడా, బ్రిటన్ వ్యాప్తంగా ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాడు. ఇతనికి పాకిస్తాన్ ప్రభుత్వంతో పాటు ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయి. పలు సందర్భాల్లో ప్రధాని మోడీ, అమిత్ షా, జై శంకర్, అజిత్ దోవల్ వంటి వారికి ప్రాణాపాయ బెదిరింపులు చేశాడు. ఇతనికి, ఇతని సన్నిహితులకు చెందిన ఆస్తుల్ని ఇటీవల ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. ఇటీవల నవంబర్ 19న ఎయిరిండియా విమానాలకు ప్రమాదం ఉందని బెదిరించాడు.