కేరళలో మతతత్వాన్ని వ్యాపింపజేసేందుకు సంఘ్ పరివార్ కుట్రలు చేస్తుంటే, ప్రతిపక్ష కాంగ్రెస్ అవకాశవాద ధోరణితో దానికి బలం చేకూర్చేలా వ్యవహరిస్తోందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శించారు. ఆదివారం అలప్పుజాలో జరిగిన పి కృష్ణపిళ్లై స్మారక అధ్యయన కేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో విజయన్ మాట్లాడుతూ, సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి సంఘ్పరివార్ ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తుంటే, అధికారం ఎలాగైనా చేజిక్కించుకోవాలన్న అవకాశంతో కాంగ్రెస్ ఆ మతత్వశక్తులతో మద్దతునిస్తుందని ఆయన అన్నారు. మతతత్వాన్ని వ్యాపింపజేసేందుకు ఆహారం, దుస్తులు వంటి వాటిని వారు లక్ష్యంగా చేసుకుంటున్నారని అన్నారు.
కేరళలో ఇప్పటివరకు వీటిపై ఎలాంటి వివాదమూ లేదు. కేరళలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టేందుకు ఈ శక్తులు పన్నుతున్న కుతంత్రాలను ప్రజలు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. హలాల్ పేరుతో మత విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. పార్లమెంటు ఆహారంలో కూడా హలాల్ ప్రస్తావన ఉందని విజయన్ అన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా ఎవ్వరూ వ్యవహరించిన ధీటుగా సమాధానం చెబుతామని విజయన్ అన్నారు.