Congress-TMC Merger: బెంగాల్ రాజకీయ పరిణామాలు, భారత రాజకీయలో కీలక మార్పులు తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సంక్షోభం తారాస్థాయికి చేరింది. ఇప్పటికే మమతను ధిక్కరించి ఎమ్మెల్యేలు, ఎంపీలు తిరుగుబాటు చేశారు. దీంతో టీఎంసీ 4 ముక్కలుగా మారింది. ఎంపీలంతా కాకోలిఘోష్ దస్తీదార్ మద్దతు ప్రకటిస్తే, ఎమ్మెల్యేలు రీటబ్రత బెనర్జీ వైపు ఉన్నారు. దీంతో మమతా బెనర్జీకి వరసగా షాక్లు తగులుతూ ఉన్నాయి.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్-టీఎంసీ విలీనం దిశగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. బుధవారం టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ గంటన్నర పాటు రాహుల్ గాంధీతో చర్చించడం ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశంలో ప్రతిపక్ష కూటమిలో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అంగీకరించినట్లు మమత వర్గం స్పష్టం చేసింది. మరోవైపు, విలీనంపై తృణమూల్ నుంచే ప్రతిపాదన రావాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. ఈ విషయంలో తాము ఎలాంటి ఒత్తిడి చేయమంటూ చెబుతున్నట్లు తెలుస్తోంది. అభిషేక్ బెనర్జీ, రాహుల్ గాంధీ మీటింగ్ ముందు మంగళవారం సోనియా గాంధీ, మమతా బెనర్జీ భేటీ అయ్యారు. ఇద్దరూ ఆప్యాయంగా పలుకరించుకున్నారు. ఈ భేటీ తర్వాత నుంచి టీఎంసీ కాంగ్రెస్లో విలీనం అవుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
మరోవైపు, బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ వ్యాఖ్యలు కూడా విలీనంపై అనుమానాలు పెంచేలా చేసింది. ఆ రాష్ట్ర అధ్యక్షుడు శుభంకర్ సర్కార్ మాట్లాడుతూ.. ‘‘రాజకీయాలు అంటేనే అవకాశాల కళ, రేపు ఏమైనా జరగొచ్చు. మా నాయకుడు రాహుల్ గాంధీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి, బీజేపీ నియంతృత్వానికి వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. ఆయన ఎన్నడూ రాజీ పడలేదు. రాహుల్ గాంధీ అనగారిన వర్గాల గొంతుక. ఆయనే ప్రధానమంత్రి కావాలి. దీనిని అంగీకరించే ఎవరికైనా కాంగ్రెస్ ద్వారాలు తెరిచే ఉన్నాయి. ’’ అని అన్నారు.
ఈ ఊహాగానాలపై బీజేపీ తీవ్రంగా విరుచుకుపడింది. రాహుల్, అభిషేక్ కలయికను యువరాజుల కలయికగా పేర్కొంది. వారు అధికారంలో కోసం ఏమైనా చేయగలరని, ఎవరినైనా ఆలింగనం చేసుకోగలరని విమర్శించింది. ఇదిలా ఉంటే, టీఎంసీ పార్టీ ఎంపీ సుస్మితా దేవ్ రాజీనామా చేసింది. అస్సాం సీఎం హిమంత బిశ్వసర్మను కలవడంతో ఆమె బీజేపీలో చేరుతుందనే ప్రచారం ఊపందుకుంది. ఈ పరిణామాలను చూస్తే పార్టీ ఎంపీలు బీజేపీ వైపు ఉంటే, పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ వైపు చూస్తోంది.

