ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే కార్పొరేట్ ఆస్పత్రికి పరుగులు పెడుతున్న రోజులివి. కానీ సర్కారీ ఆస్పత్రుల్లో అంతకుమించిన సౌకర్యాలు వున్నాయి. ఎంతోమంది మహిళా ఉన్నతాధికారులు ప్రభుత్వాసుపత్రిలోనే డెలివరీకి వెళుతున్నారు. తాజాగా ఓ జంట ప్రభుత్వాసుపత్రి వైద్యుల సహకారంతో తల్లిదండ్రులయ్యారు. అదికూడా ఎంతో ఖరీదుగా భావించే ఐవీఎఫ్ పద్దతి ద్వారా ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. బిహార్ రాజధాని పట్నాలోని ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ఆసుపత్రిలో ఈ అరుదైన సంఘటన జరిగింది. రాష్ట్ర చరిత్రలోనే ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో టెస్ట్ ట్యూబ్ బేబీ జన్మించటం ఇదే తొలిసారి అని వైద్యులు చెబుతున్నారు.
ఐవీఎఫ్ కేంద్రంలో తొలిసారి బిడ్డకు జన్మనివ్వటం, ఆ పాప ఆరోగ్యంగా ఉండటం చాలా సంతోషకరమైన అంశమని ఆసుపత్రి సూపరింటెండెంట్ మనీశ్ మండల్అంటున్నారు. సహస్రా ప్రాంతానికి చెందిన మిథిలేశ్ కుమార్, అనితా కుమారి దంపతులకు 14 ఏళ్ల క్రితం వివాహం అయింది. అయితే వారికి పిల్లలు లేరు. ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ పురుషుడి శుక్రకణాలు మహిళ అండంతో కలవలేకపోవడం వల్ల వారి కల నెరవేరలేదు. మూడేళ్ళుగా ఐవీఎఫ్ ద్వారా వారికి సంతాన భాగ్యం కలిగించేందుకు డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి.
అనితా కుమారి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఎన్నో ఎళ్లుగా ఎదురుచూస్తున్న వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. జన్యుపరమైన సమస్యలు ఉండి సంతానం లేని దంపతులకు ఐవీఎఫ్ చాలా ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతున్నారు. మొత్తం మీద సర్కారీ దవాఖానా అరుదైన ఘనతకు వేదికైంది. కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్ళి లక్షలకు లక్షలు ఖర్చుచేయకుండా ఇలాంటి ఇబ్బందులు వున్నవారు ప్రభుత్వాసుపత్రి వైద్యులను సంప్రదించాలని వారు కోరుతున్నారు. తెలంగాణలో పలువురు మహిళా ఐఎఎస్ లు కూడా ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవించడం శుభపరిణామం.