జార్ఖండ్ పర్యటనకు వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ప్రతీ దశలో వారు మాకు వెన్నంటే శిబూ సొరేన్ ఉన్నారు.. వారిని కలిసి, ఆశీర్వాదం తీసుకోవాల్సి ఉంది.. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నాకు శిబు సోరెన్ని కలిపించడం చాలా సంతోషాన్ని కలిగించింది. నేను వారి ఆశీర్వాదం తీసుకున్నాని తెలిపారు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, మంచి అభివృద్ధి సాధిస్తున్నందుకు వారు సంతోషం వ్యక్తం చేశారని.. ఫలవంతమైన చర్చలు జరిగాయి. రాజకీయపరమైన చర్చలు కూడా జరిగాయి. దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులతో చర్చలు సాగుతున్నాయని తెలిపారు. అయితే, నేనొక విషయాన్ని స్పష్టం చేయదలిచాను అన్ని ఆయన.. 75 సంవత్సరాల స్వాతంత్ర్యం అనంతరం కూడా దేశం అభివృద్ధి చెందాల్సినంతగా జరగలేదు. ప్రపంచంతో పోల్చితే చాలా విషయాల్లో మనం వెనుకబడిపోయాం. పొరుగున ఉన్న చైనా అభివృద్ధి చెందింది. ఎన్నో ఆసియా దేశాలు అభివృద్ధి చెందాయి. ప్రస్తుతం కేంద్రంలో నడుస్తున్న ప్రభుత్వం, దేశాన్ని సరైన దిశలో నడిపించడం లేదు. దీనిని సరిచేయాల్సిన బాధ్యత ప్రతీ భారతీయుడిపై ఉంది. దీనికి సంబంధించి కూడా చర్చ జరిగినట్టు వెల్లడించారు.
Read Also: Police Vehicle: పార్టీ ర్యాలీలో పోలీసు వాహనం.. జెండా కూడా పెట్టారు..!
ఇక, దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు సీఎం కేసీఆర్.. త్వరలోనే మేమంతా ఒకచోట కలుస్తాం. తర్వాత ఏ ఎజెండాతో ముందుకు పోవాలో, ఎలా ముందుకు పోవాలో, దేశాన్ని మరింత ఉత్సాహంగా, అభివృద్ధి దిశగా ఎలా నడిపించాలనే ప్రయత్నాలను ఏ విధంగా అందరం కలిసి ముందుకు తీసుకుపోవాలనే విషయాలను చర్చిస్తాం. దీనికి సంబంధించిన విషయాలను తర్వాత మరింతగా మీకు వివరిస్తామని తెలిపారు. భారతదేశాన్ని సరైన దిశలో తీసుకుపోవాల్సిన ఒక గట్టి ప్రయత్నం జరగాలని ఈ ప్రయత్నం ప్రారంభమైందన్నారు. చర్చలు జరుగుతున్నాయి. అయితే, బీజేపీ వ్యతిరేక ఫ్రంటా?, కాంగ్రెస్ వ్యతిరేక ఫ్రంటా? ఆ ఫ్రంట్.. ఈ ఫ్రంట్ లాంటివి ఏవీ లేవని.. నేను ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా.. థర్డ్ ఫ్రంట్, ఫోర్త్ ఫ్రంట్… ఏ ఫ్రంట్ ఇప్పటికీ ఖరారు కాలేదు. భవిష్యత్తులో దీని పై స్పష్టత వస్తుందన్నారు కేసీఆర్.
అయితే, ఒకటి మాత్రం వాస్తవం… 75 సంవత్సరాల స్వాతంత్ర్యానంతరం దేశంలో జరగాల్సినంత అభివృద్ధి జరగలేదన్నారు కేసీఆర్.. ఆశించిన ఫలాలు ప్రజలకు అందలేదు.. కొత్త మార్గంలో సాగాల్సిన అవసరం ఉంది. ఆ మార్గం ఏంటి? ఎలా చేయాలి? ఏం చేయాలి ? అనే విషయాలు ఇంకా ఖరారు కాలేదన్నారు.. భవిష్యత్తులో ఈ విషయాల పై స్పష్టత వస్తుందన్న ఆయన.. పురోగామి భారత్ను నిర్మించడంలో జర్నలిస్టుల పాత్రను కూడా మేం ఆశిస్తున్నాం అన్నారు. దీనికి ఇప్పుడే పేరు పెట్టకండి.. నేను చెప్పదల్చుకున్న విషయాలను స్వచ్ఛమైన, మంచి మనసుతో, అర్థవంతంగా చెప్తున్నాను. ప్రస్తుతమున్న భారత్ కంటే ఎన్నో రెట్లు మెరుగైన భారత్ను నిర్మించి, వాటి ఫలితాలను ప్రజలకు అందజేయలనేదే మా ఆకాంక్ష అని… అందుకు అనుగుణంగానే మా ప్రయత్నాలు సాగుతున్నాయని తెలిపారు. ఇక, దేశంలో ఎన్నో పార్టీలను, పలు సంఘాల నేతలను, రైతు నాయకులను కలవడం జరుగుతున్నది. ఏ విషయంలో ఎలా ముందుకు పోవాలనే విషయాన్ని ఒకట్రెండు రోజుల్లో నిర్ణయించలేం. ఒకరిద్దరితో ఇది అయ్యే పని కాదు. అందరూ కలిసి కూర్చున్నప్పుడు ఒక దారి దొరకుతుంది. ఏ దారిలో వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలా లేదా మరోటి ఏర్పాటు చేయాలా అనే విషయాలను మీకు మున్ముందు తెలియజేస్తామని తెలిపారు సీఎం కేసీఆర్.