నీట్ ప్రవేశాల్లో ఓబీసీ విద్యార్థుల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వైద్య విద్య కోసం జాతీయస్ధాయిలో నిర్వహిస్తున్న నీట్ ప్రవేశపరీక్ష అడ్మిషన్లలో ఓబీసీ కోటా రాజ్యాంగ బద్ధతను సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రతిభకు ఎక్కువ మార్కులే కొలమానం కాదని.. నీట్ ప్రవేశాల్లో ఓబీసీ స్టూడెంట్లకు రిజర్వేషన్లను అనుమతిస్తూ జనవరి 7న ఇచ్చిన తీర్పుకే కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. 2021–22 అడ్మిషన్లలో రిజర్వేషన్లను యథాతథంగా అమలు చేయాలని తేల్చి చెప్పింది.
సామాజిక, ఆర్థిక నేపథ్యానికి సంబంధించి మెరిట్ తప్పనిసరిగా సందర్భోచితంగా ఉండాలని, వెనుకబాటుతనాన్ని పరిష్కరించడంలో రిజర్వేషన్ల పాత్రను తిరస్కరించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. రిజర్వేషన్లు మెరిట్కు విరుద్ధంగా లేవని, కానీ సామాజిక న్యాయం పంపిణీ పరిణామాలను ఇవి మరింతగా పెంచుతాని, న్యాయమూర్తులు డివై చంద్రచూడ్, ఎఎస్ బోపన్నలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఆర్థికంగా వెనుకబడిన కులాల కోటా విషయంలోనూ ఎలాంటి మార్పులుండవని, నీట్ ప్రవేశాల్లో అది కూడా అమల్లోనే ఉంటుందని పేర్కొంది.
వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉన్న వారు రిజర్వేషన్లకు అర్హులని తెలిపింది. ప్రవేశాలు జరిగే సమయంలో కోర్టులు జోక్యం చేసుకోవడం వల్ల ఆ ప్రవేశాల ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే ప్రమాదముందని సుప్రీంకోర్టు పేర్కొంది. కాబట్టి 2021–22 బ్యాచ్ ప్రవేశాలకు సంబంధించి రిజర్వేషన్లపై ఎలాంటి స్టే ఇచ్చేది లేదని తీర్పునిచ్చింది. కరోనా కేసులు పెరుగుతున్న ఇలాంటి సమయంలో వైద్యుల నియామక ప్రక్రియ ఆలస్యమైతే ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కాబట్టి రిజర్వేషన్లకు సంబంధించి అన్ని వర్గాల వారి అభిప్రాయాలను వినకుండా స్టే విధించడం సబబు కాదని పేర్కొంది.