దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్న నీట్ వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం విచారణ చేపట్టింది. మే 5న మెడికల్ ప్రవేశ పరీక్ష కోసం జరిగిన అవకతవకలు పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు నీట్-యూజీ విచారణను వచ్చే గురువారం (జూలై 18కి) వాయిదా వేసింది. ఈ వ్యవహారంపై జరుగుతున్న విచారణకు సంబంధించి నివేదికను సీబీఐ కోర్టుకు సమర్పించింది.
శుక్రవారమే విచారణ చేపడతామని న్యాయస్థానం చెప్పినప్పటికీ.. సొలిసిటర్ జనరల్ అభ్యర్థన మేరకు వాయిదాను పొడిగించింది. జూలై 8న ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ వ్యవహారంపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తమ స్పందనలు తెలియజేశాయని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. ఆ అఫిడవిట్లు పిటిషన్దారులకు ఇంకా చేరలేదని.. వాటిని పరిశీలించేందుకు వీలుగా సమయమిస్తూ తదుపరి విచారణ జూలై 18కి వాయిదా వేస్తున్నట్లు చంద్రచూడ్ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే లీకైన ప్రశ్నపత్రం బీహార్లోని ఒక్క పరీక్ష కేంద్రానికే పరిమితమైందని, విస్తృతంగా వ్యాప్తి చెందలేదని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ సుప్రీంకోర్టుకు తెలియజేసినట్లు సమాచారం. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ ఇది వ్యాప్తి చెందలేదని పేర్కొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన నివేదికను ధర్మాసానానికి సీబీఐ సీల్డ్ కవర్లో గురువారం అందజేసింది.