శబరిమల ప్రస్తుతం అయ్యప్ప భక్తులతో కిటకిటలాడుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా.. మండల పూజ ప్రారంభం నుంచే శబరిమలకు భక్తులు పోటెత్తారు. ప్రస్తుతం శబరిమలలో 2 లక్షలకు పైగా భక్తులు ఉన్నారు. అయ్యప్ప స్వామి దర్శనం కోసం స్వాములు ఎదురు చూస్తున్నారు. కిలోమీటర్ల మేర భక్తులు పడిగాపులు కాస్తూ అవస్థలు పడుతున్నారు. అయ్యప్ప స్వామి దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది.
ఆన్లైన్ స్లాట్లో అధికారులు 70 వేల టికెట్లు ఇచ్చారు. ఆఫ్లైన్లో మరో పాతిక వేల మందికి అవకాశం కల్పించారు. రెండు లక్షల మందికి పైగా ప్రస్తుతం శబరిమలలో అయ్యప్ప భక్తులు స్వామి దర్శనార్థం ఎదురుచూపులు చూస్తున్నారు. తాగడానికి కనీసం నీళ్లు, తినడానికి ఆహారం లేకుండా గంటల తరబడి క్యూలైన్లో ఉండడంతో అయ్యప్పలు సొమ్మసిల్లి పడిపోతున్నారు. క్యూలైన్ల వద్ద ఎక్కడ కూడా ఆలయ సిబ్బంది, పోలీసులు కనిపించడం లేదు. ఎక్కడ తోపులాట జరుగుతుందేమో అని భక్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Kunamneni Sambasiva Rao: ఫేక్ ఎన్కౌంటర్స్ చేయడం విచారకరం.. జంగిల్ రాజ్ పాలనకు పరాకాష్ట!
అత్యధికంగా తెలుగు రాష్ట్రాల నుంచి భక్తుల శబరిమల చేరుకున్నారు. తెలుగు రాష్టాల నుండి వెళ్లిన స్వాములు అవస్థలు పడుతున్నారు. కనీసం తాగడానికి నీరు లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస ఏర్పాట్లు చేయలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రికార్డు స్థాయిలో 1.25 లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారు. స్పాట్ బుకింగ్ కారణంగానే రద్దీ విపరీతంగా పెరిగిందని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) అధికారులు అంటున్నారు. సోమవారం నుంచి నీలక్కల్, పంపాబేస్, శబరిమల సన్నిధానం కిక్కిరిసిపోయింది. ఇసుకేస్తే రాలనంతగా స్వాములు కనిపిస్తున్నారు.