మావోయిస్టులను చంపుకుంటూ పోవడమంటే మానవ హననం తప్ప మరొకటి కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివ రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు జంగిల్ రాజ్ పరిపాలనకు పరాకాష్ట అని పేర్కొన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల పోలీసులు కూడా ఇందులో పావులుగా మారారని ఆయన మండిపడ్డారు. ఈ రోజు మారేడుమిల్లిలో జరిగిన హిడ్మా ఎన్కౌంటర్, అంతకుముందు మావోయిస్టులపై జరిగిన ఎన్కౌంటర్స్ మొత్తం ఫేక్ అని కూనంనేని అన్నారు.
బూటకపు ఎన్ కౌంటర్స్తో మనుషులను చంపుకునే వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదని కూనంనేని సాంబశివ రావు ఫైర్ అయ్యారు. మావోయిస్టులు ఏదైనా నేరాలు చేసివుంటే వారిని అరెస్టు చేసి, చట్టభద్దంగా విచారణ జరిపించాలే తప్ప ఇలాంటి ఫేక్ ఎన్కౌంటర్లు చేయడం విచారణకరమన్నారు. మావోయిస్టులపై జరుగుతున్న ఎన్కౌంటర్లపై విచారణ జరిపించాలని కూనంనేని సాంబశివ రావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.