RSS Is Real Coffee, BJP Just The Froth Says Prashant Kishor: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీజేపీ-ఆర్ఎస్ఎస్ బంధాన్ని కాఫీ కప్ తో పోల్చారు. ఆర్ఎస్ఎస్ కాఫీ అయితే.. దానిపై నురగలాంటిది బీజేపీ అని అన్నారు. బీహార్ రాష్ట్రంలో 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్న ప్రశాంత్ కిషోర్ పశ్చిమ చంపారన్ జిల్లాలోని లారియా వద్ద ఈ వ్యాఖ్యలు చేశారు. గాంధీ కాంగ్రెస్ పునరుద్ధరించడం ద్వారానే గాడ్సే సిద్ధాంతాన్ని ఓడించగలమని గ్రహించడానికి తనకు చాలా సమయం పట్టిందని.. నితీష్ కుమార్, జగన్మోహన్ రెడ్డికి పనిచేయడానికి బదులు నేను ఆ దిశగా ఆలోచన చేస్తే బాగుండేదని పీకే అన్నారు.
నరేంద్ర మోదీని అడ్డుకోవడానికి ఏర్పడిన ప్రతిపక్షాల కూటమి సమర్థతపై సందేహాన్ని వ్యక్తం చేశారు పీకే. బీజేపీ గురించి తెలియకపోతే ఓడించలేమని స్పష్టం చేశారు. కాఫీ కప్ లో నురగ బీజేపీ అయితే.. దాని కింద ఉంటే కాఫీ ఆర్ఎస్ఎస్ అని.. దాని నిర్మాణం చాలా లోతైనదని.. సంఘ్ సామాజిక వ్యవస్థలోకి ప్రవేశించిందని.. షార్ట్ కట్స్ తో దాన్ని కొట్టలేమని ఆయన అన్నారు.
Read Also: Poonam Kaur: సోషల్ మీడియాలో రచ్చగా మారిన రాహుల్ గాంధీ-పూనమ్ కౌర్ ఫోటో
2014 లోక్ సభ ఎన్నికల సమయంలో బీజేపీకి ప్రశాంత్ కిషోర్ సహకరించారు. బీజేపీ సొంతంగా మెజారిటీలోకి రావడానికి ఆయన వ్యూహాలు సహాయపడ్డాయి. గతంలో జేడీయూ లీడర్ గా ఉన్న పీకే ప్రస్తుతం ఆ పార్టీ అధినేత, బీహర్ సీఎం నితీష్ కుమార్ ను బీజేపీ ఏజెంట్ అని విమర్శిస్తున్నారు. సీఏఏ-ఎన్ఆర్సీ సమయంలో నేను జేడీయూ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నానని.. అయితే పార్లమెంట్ లో మాత్రం జేడీయూ ఎంపీలు పౌరసత్వ సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయడంతో షాక్ అయ్యానని అన్నారు.
గతేడాది కాంగ్రెస్ సీనియర్ నాయకులతో సమావేశం అయిన ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీలో చేరుతారని అనుకున్నారు. అయితే మహాత్మా గాంధీ నాయకత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ ను ఇప్పటికీ ఆరాధిస్తున్నానని పీకే అన్నారు. గాంధీ కాంగ్రెస్ పునరుజ్జీవింపచేయడం ద్వారానే గాడ్సే భావజాలాన్ని ఓడించగలమని ప్రశాంత్ కిషోర్ అన్నారు. గాంధీ హంతకుడు గాడ్సేకు ఆర్ఎస్ఎస్ తో సంబంధాలపై పరోక్షంగా వ్యాక్యలు చేశారు.