మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ నరవణే రాసిన ఆత్మకథ పుస్తకం దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. అటు పార్లమెంట్లోనూ.. ఇటు పబ్లిక్లోనూ రచ్చరచ్చ చేస్తోంది. ప్రస్తుతం ఈ పుస్తకంపై అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా ఈ పుస్తకం బయటకు రావడంపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేతిలోకి ఆ పుస్తకం ఎలా వచ్చిందన్న అంశంపై కూపీ లాగుతున్నారు.
పబ్లిషర్ పెంగ్విన్ స్పందన.
ఇదిలా ఉంటే మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే రాసిన ‘‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’’ పుస్తకం ప్రచురణ కాలేదని పబ్లిషర్ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా వెల్లడించింది. ఆ పుస్తకం ప్రచురణ హక్కులు తామే కలిగి ఉన్నామని.. అది ముద్రించలేదని.. డిజిటల్ రూపంలోనూ విడుదల కాలేదని స్పష్టం చేసింది. నరవణే పుస్తక కాఫీలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ వివరణ ఇస్తూ ఒక ప్రకటనను విడుదల చేసింది.
అమ్మకానికి ప్రజలకు అందుబాటులో ఉంచలేదని స్పష్టం చేసింది. అనధికారిక ప్రచారంలో ఉన్న కాపీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ప్రకటనలో పేర్కొంది. డిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని.. సంబంధిత అధికారుల అనుమతి లేకుండానే పుస్తకం సోషల్ మీడియాలోనూ.. ఆన్లైన్ వార్తా సంస్థల ద్వారా ప్రచారంలో ఉండటాన్ని పోలీసులు పరిగణనలోకి తీసుకున్నట్లు అధికారిక ప్రకటనలో తెలిపింది.
రాహుల్ గాంధీ..
తాజాగా రాహుల్ గాంధీ స్పందించారు. ‘‘నా పుస్తకం అందుబాటులో ఉందని మనోజ్ నరవణే ట్వీట్ చేశారు. పుస్తకం ప్రచురణ కాలేదని పబ్లిషర్ పెంగ్విన్ అయినా అబద్దం చెప్పుండాలి… లేదంటే నరవణే అయినా అబద్దం చెప్పుండాలి. నేను అయితే నరవణే ట్వీట్ను నమ్ముతున్నాను. పుస్తకం అమెజాన్లో అందుబాటులో ఉంది. పుస్తకంలో భారత ప్రభుత్వానికి.. ప్రధాని మోడీకి అసౌకర్యంగా ప్రకటనలు ఉండొచ్చు’’ అని రాహుల్ గాంధీ అన్నారు. నరవణే పుస్తకంపై ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత ప్రతిపక్ష నేత ఈ వ్యాఖ్యలు చేశారు.
