PM Modi: డీలిమినేషన్ బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని ప్రధాని నరేంద్రమోడీ లోక్సభలో హామీ ఇచ్చారు. గురువారం ఆయన మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై మాట్లాడారు. చిన్న రాష్ట్రం, పెద్ద రాష్ట్రం అనే తేడాలు మాకు లేవని ప్రధాని అన్నారు. మహిళా బిల్లు ద్వారా మాకు క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదని, మీరే క్రెడిట్ తీసుకోవాలని విపక్షాలకు సూచించారు. కావాలంటే ప్రభుత్వ ఖర్చుతో మీ ఫోటోలు వేయించి ప్రచారం చేయిస్తానని చెప్పారు. అందరి కలిసి కట్టుగా నిర్ణయం తీసుకుంటే ఎవరికి మైలేజ్ అనే ప్రస్తావనే ఉండదని అన్నారు.
Read Also: PM Modi: ఇది చరిత్ర సృష్టించే సమయం.. మహిళా రిజర్వేషన్లకు ప్రధాని మద్దతు..
బిల్లు విషయంలో తనకు లాభం చేకూరుతుందని కొందరు భావిస్తున్నారని, మీరు వ్యతిరేకిస్తే సహజంగా నాకు రాజకీయ లాభం చేకూరుతుందని, దీనికి మద్దతు ఇస్తే ఈ ఘటన అందరికి ఘనత దక్కుతుందని అన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ప్రకటనలో ప్రతీ ఒక్కరి ఫోటోలు వేయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. కావాలంటే ఈ క్రెడిట్ మీరే తీసుకునే పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు విపక్షాలకు చురకలు అంటించారు. మరోవైపు డీలిమిటేషన్ వల్ల ఒక్క రాష్ట్రానికి కూడా అన్యాయం జరుగదని ప్రధాని స్పష్టం చేశారు. కొందరు ఈ బిల్లు ద్వారా ఉత్తరాది, దక్షిణాది విబజన తీసుకురావాలని చూస్తున్నారని, దేశమంతా ఒక్కటే అని దీంట్లో విభజన తీసుకురావద్దని విపక్షాలకు హితవు పలికారు. ఈ బిల్లు వెనక ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని మరోసారి చెప్పారు.