ప్రధాని మోడీ మరోసారి అమెరికా పర్యటనకు సిద్ధపడుతున్నారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఫిబ్రవరిలో మోడీ వైట్హౌస్ సందర్శించారు. ట్రంప్తో మంచి సంబంధాలు కనిపించాయి. అయితే ఈ మధ్య సుంకాలు కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో మోడీ అమెరికా పర్యటన చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇది కూడా చదవండి: Rajasthan: ఘోరం.. వ్యాన్-కంటైనర్ ఢీ.. ఏడుగురు పిల్లలు సహా 10 మంది మృతి
సెప్టెంబర్లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం జరగనుంది. సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభమయ్యే ఈ సమావేశాలకు ప్రపంచ నాయకులంతా హాజరుకానున్నారు. న్యూయార్క్ వేదికగా జరిగే ఈ సమావేశానికి ప్రధాని మోడీ కూడా హాజరుకానున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సహా పలువురు నాయకులను మోడీ కలవనున్నారు. పర్యటనలో భాగంగా ట్రంప్తో కూడా మోడీ సమావేశం కానున్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న సుంకాల వివాదం పరిష్కారం అయ్యే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: TG School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. నేడు, రేపు పాఠశాలలకు సెలవు
వాణిజ్య సమస్యలు కారణంగా అమెరికాతో సంబంధాలు దెబ్బతిన్న కారణంగా ట్రంప్తో మోడీ సమావేశమై సమస్యలను పరిష్కరించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ట్రంప్ మొదటి పరిపాలన కాలంలో మోడీతో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. మోడీ స్నేహితుడిగా ట్రంప్ అభివర్ణించారు. అయితే రెండోసారి అధికారంలోకి వచ్చాక.. భారత్పై భారీగా సుంకాలు విధించడంతో బంధాలు బీటలువారాయి.
భారత్పై తొలుత 25 శాతం సుంకం విధించగా అది ఆగస్టు 7 నుంచి అమల్లోకి వచ్చింది. అనంతరం రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధించినట్లుగా ట్రంప్ బాంబ్ పేల్చారు. ఇలా భారత్పై 50 శాతం సుంకం విధించారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇక మోడీ పర్యటనతోనైనా సంబంధాలు మెరుగుపడతాయేమో చూడాలి.
