Lalu Prasad Yadav: బీహార్ పాట్నా వేదికగా ఈ రోజు రాష్ట్రీయ జనతాదళ్ ఆధ్వర్యంలో ‘జన్ విశ్వాస్ ర్యాలీ’ జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్తో పాటు ఆయన కుమారుడు, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ హిందువు కాదని అన్నారు.
ప్రధాని హిందువు కాదని, ఆయన తల్లి మరణిస్తే గుండు కొట్టించుకోలేదని లాలూ అన్నారు. ప్రధాని మోడీ కుటుంబ రాజకీయాలపై దాడికి పాల్పడుతున్నారని, అతనికి కుటుంబమే లేదని ఎద్దేవా చేశారు. తల్లి మరణిస్తే హిందువులెవరైనా గుండు చేయించుకుంటారని, కానీ ప్రధాని అలా చేయలేదని, ఎందుకు గుండు చేయించుకోలేదు..? అతను హిందువు కాదని మోడీని టార్గెట్ చేస్తూ లాలూ విమర్శలు గుప్పించారు. కుటుంబ రాజకీయాలను ప్రధాని టార్గెట్ చేస్తున్నారని, అతనికి ఎందుకు పిల్లలు లేరు, ఎందుకు ఫ్యామిలీ లేదు, ఎందుకంటే అతను హిందువు కాదు అంటూ ఆరోపించారు. ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా విద్వేషాన్ని పెంచుతున్నారని మండిపడ్డారు.
Read Also: Harsh Vardhan: ‘‘నా క్లినిక్ నా కోసం ఎదురుచూస్తోంది’’.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన బీజేపీ నేత..
ఆర్జేడీ చీఫ్ తేజ్వసీ యాదవ్ మాట్లాడుతూ.. బీజేపీ నాయకులంతా అబద్ధాలలకోరులు, వారు అందర్నీ మోసం చేస్తున్నారు అని ఆరోపించారు. ‘‘నిన్న ప్రధాని మోడీ వచ్చి మా నాన్న గురించి మాట్లాడారు., లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన పనుల్ని మీరెందుకు గొప్పగా చెప్పుకోవడం లేదని ఆయన (మోడీ) నన్ను పరోక్షంగా ప్రశ్నించారు. లాలూ చారిత్రత్మక పనులు చేశారు, యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో రైల్వేలకు రూ.90,000 కోట్ల లాభం తీసుకువచ్చారు’’ అని తేజస్వీ యాదవ్ ప్రధానిని ఉద్దేశించి మాట్లాడారు. నిన్న బీహార్ ఔరంగాబాద్లో జరిగిన సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ, సీఎం నితీష్ కుమార్తో కలిసి పాల్గొన్నారు. రైల్వే వనరులు ఎలా దోచుకున్నారో, ఉద్యోగ అవకాశాలు ఎలా దోచుకున్నారో బీహార్ ప్రజలకు తెలుసు అంటూ ప్రధాని మోడీ లాలూ ప్రసాద్ అవినీతిని గురించి ప్రస్తావించారు.