Bundelkhand Expressway: ఉచిత పథకాల హామీలు ఇచ్చి ఓట్లు సేకరించే సంస్కృతి దేశానికి చాలా ప్రమాదకరమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. తమ ప్రభుత్వం సౌకర్యాలు కల్పించడమే కాకుండా దేశ భవిష్యత్ను నిర్మిస్తోందని ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్లో నిర్మించిన బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వేను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి ప్రారంభించారు. యూపీలో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో శాంతిభద్రతలు మెరుగుపడడమే కాకుండా.. వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు ప్రధాని వెల్లడించారు. ఇదంతా డబుల్ ఇంజిన్ సర్కారుతోనే సాధ్యం అని మోదీ స్పష్టం చేశారు.
యూపీలో నిర్మించిన 296 కిలోమీటర్ల బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వేను సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి ప్రధాని ప్రారంభించారు. రూ.14,850 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వే ఉత్తర్ప్రదేశ్లోని 7 జిల్లాలను కలుపుతుంది. నాలుగు లైన్ల ఎక్స్ప్రెస్ వేను 6 లైన్లకు విస్తరించారు. ఈ రహదారి ద్వారా చిత్రకూట్ నుంచి దిల్లీకి ఆరు గంటల్లోనే చేరుకోవచ్చు. ఈ నేపథ్యంలో జలౌన్ జిల్లా ఒరాయ్ మండలం కైతేరీ గ్రామంలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని మోదీ.. ఈ ఎక్స్ప్రెస్ వేతో చిత్రకూట్ నుంచి ఢిల్లీకి ప్రయాణం దాదాపు 3 నుంచి 4 గంటలు తగ్గడమే కాకుండా పారిశ్రామికంగా బుందేల్ఖండ్ పరుగులు పెడుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్లో కనెక్టివిటీని పెంచే లక్ష్యంతో ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభించారు. దీనితో యూపీలో ఆరవ ఎక్స్ప్రెస్వే అందుబాటులోకి వచ్చినట్లయింది. ఫిబ్రవరి 29, 2020న బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్వే నిర్మాణానికి ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. 28 నెలల్లోనే ఎక్స్ప్రెస్వే పనులు పూర్తయ్యాయి. ఉత్తరప్రదేశ్ ఎక్స్ప్రెస్వేస్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ ఎక్స్ప్రెస్ వే నిర్మించబడింది. ఎక్స్ప్రెస్వే ప్రాజెక్టుతో వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయని.. నగరాలలో ఉండే సౌకర్యాలు సామాన్య ప్రజానీకానికి సైతం అందుబాటులోకి వస్తాయని పీఎంవో వెల్లడించింది.