ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగి పట్టుబడితే 48 గంటలు కస్టడీలో ఉంటే వెంటనే సస్పెండ్కు గురవుతారని.. అలాంటిది ఒక ముఖ్యమంత్రి గానీ.. ఒక మంత్రి గానీ.. ఒక ప్రధానమంత్రి గానీ జైల్లో ఉంటే వారెందుకు అధికారం అనుభవిస్తున్నారని మోడీ ప్రశ్నించారు. ఇది ఎలా సాధ్యమవుతుందని నిలదీశారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ప్రధాని మోడీ గయలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కళంక మంత్రులను తొలగించే బిల్లుపై తొలిసారి స్పందించారు. కళంక మంత్రులు జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడమేంటి? అని మోడీ ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: Putin: ఆ 3 కండీషన్స్ ఒప్పుకుంటేనే శాంతి చర్చలు.. తేల్చి చెప్పిన పుతిన్!
అవినీతిపై పోరాటం ముగింపు దిశకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ఇందులో ప్రధాని గానీ.. ముఖ్యమంత్రి గానీ, మంత్రిగానీ మినహాయింపు ఉండకూడదన్నారు. ఇటీవల జైలుకెళ్లిన వారు ఫైళ్లపై ఎలా సంతాలు చేశారో మనమంతా చూశామని గుర్తుచేశారు. ఇకపై ఇలా జరగకూడదనే కళంక మంత్రులను తొలగించే బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టినట్లు చెప్పారు.
ఇది కూడా చదవండి: Tej Pratap Yadav: నా నాశనానికి 5 కుటుంబాలు కుట్రపన్నాయి.. లాలూ కుమారుడు ఆరోపణలు
తీవ్రమైన నేరాలకు పాల్పడి 30 రోజుల్లో జైల్లో ఉంటే ప్రధానమంత్రిగానీ.. ముఖ్యమంత్రిగానీ తొలగించే బిల్లును పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. ఈ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. విపక్ష నాయకులను బలహీన పరిచేందుకే ఈ బిల్లు తీసుకొస్తున్నట్లు తప్పుపట్టాయి. లిక్కర్ స్కామ్లో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. జైలు నుంచి 6 నెలల పాటు పరిపాలించారు. తాజాగా ఆ విషయాన్ని మోడీ బీహార్లో పరోక్షంగా ప్రస్తావించారు.