UP Assembly: అసెంబ్లీకి హాజరయ్యే ఎమ్మెల్యేలు తమతోపాటు అసెంబ్లీలోకి ఏవైనా తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుంది. ఇతరులకు అనుమతి ఉండదు. కానీ ఇకపై అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ఎమ్మెల్యేలు సైతం తమ ఫోన్లను లోనికి తీసుకెళ్లడానికి వీల్లేదు. అదేంటీ ఎక్కడ ఇటువంటి రూల్ ఉంది? అని అనుకుంటున్నారా? కొత్తగా ఉత్తర్ప్రదేశ్లో ఈ రూల్ను తీసుకురానున్నారు. వీటితోపాటు మరికొన్ని కొత్త నిబంధనలను కూడా రూపొందించారు. వాటిపై నేడు అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేసిన తరువాత వాటిని అమలు చేయనున్నారు.
Read also: YSRCP on No Confidence Motion: కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించిన వైసీపీ
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీలో కొత్త రూల్స్ అమలు కానున్నాయి. ఇకపై అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ఎమ్మెల్యేలు ఎటువంటి పేపర్లను తమతోపాటు లోనికి తీసుకెళ్లకూడదు. అసెంబ్లీలోకి సెల్ఫోన్లను సైతం అనుమతించరు. అసెంబ్లీలో బిగ్గరగా నవ్వరాదని.. సభలో ఎటువంటి పత్రాలు చించకూడదు. స్పీకర్కు వెన్ను చూపేలా నిల్చోవడం లేదా కూర్చోవడం చేయకూడదు. ఇటువంటి కొత్త నిబంధనలు ఇకపై బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్బంగా అమలు కానుంది. ఉత్తరప్రదేశ్ శాసనసభ విధివిధానాలు, సభలో ప్రవర్తనకు సంబంధించిన కొత్త నియమాల బిల్లు- 2023ను సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీనిపై నేడు చర్చ జరిపిన తర్వాత ఈ బిల్లును ఆమోదించనున్నట్లు యూపీ అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా ప్రకటించారు. కొత్త నిబంధనల ప్రకారం శాసనసభ్యులు సభలో ఎలాంటి పత్రాలను చించే వీలుండదు. సభలో వారు మాట్లాడుతున్నప్పుడు గ్యాలరీలో ఎవరి వైపు చూడటం చేయకూడదు. సభ్యులు వంగి స్పీకర్ స్థానాన్ని గౌరవించాలి. ఎమ్మెల్యేలు సభలోకి ప్రవేశించేటప్పుడు, మరియు బయటకు వెళ్లేటప్పుడు లేదా కూర్చున్నప్పుడు, వారి సీట్ల నుంచి లేచేప్పుడు స్పీకర్కు వీపు చూపకూడదు. సభలోకి ఆయుధాలు తీసుకురావడం లేదా ప్రదర్శించడం నిషేధం. సభ్యులు లాబీలో పొగతాగరాదు. బిగ్గరగా మాట్లాడటం లేదా నవ్వడం చేయకూడదు. ప్రస్తుతం ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలను 14 రోజుల నుంచి ఏడు రోజులకు తగ్గించనున్నట్టు తెలిసింది. సభ్యులు ఎటువంటి సాహిత్యం, ప్రశ్నాపత్రం, పుస్తకం లేదా పత్రికా వ్యాఖ్యలను సభలోకి తీసుకురాకూడదని కొత్త నిబంధనల్లో రూపొందించారు.