నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం ప్రశ్నించింది. గతంలోనే సోనియా గాంధీకి విచారణకు హాజరుకావాలని ఆదేశించినా.. కరోనా బారిన పడిన కారణంగా ఆ సమయంలో సోనియా గాంధీ హాజరుకాలేదు. తాజాగా గురువారం రోజున ఈడీ సోనియాగాంధీని 3 గంటల పాటు ప్రశ్నించింది. విచారణ సమయంలో రాహుల్, ప్రియాంకా గాంధీలు ఈడీ ఆఫీసులోనే ఉన్నారు. సోనియా గాాంధీని దాదాపుగా 25కు పైగా ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. అడిషనల్ డైరెక్టర్ హోదా కలిగిన మహిళా అధికారి నేతృత్వంలో ఐదుగురు అధికారులు సోనియా గాంధీని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మరోసారి ఈ నెల 25న సోమవారం ఈడీ ముందు హాజరుకావాలని సోనియా గాంధీని అధికారులు ఆదేశించారు.
సోనియాగాంధీని ఈడీ విచారిస్తున్న నేపథ్యంలో ఢిల్లీలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేశాయి. పలు చోట్ల ఆందోళనలను అడ్డుకునేందుకు పోలీసులు వాటర్ క్యానెన్లను ఉపయోగించారు. కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు కార్యకర్తలను పోలీసుల అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే, పీ. చిదంబరం, అజయ్ మాకెన్, అధీర్ రంజన్ చౌదరి, మాణిక్కం ఠాగూర్, కే. సురేష్, హరీష్ రావత్, శశి థరూర్ మొదలైన వారిని అరెస్ట్ చేసి బస్సుల్లో తరలించారు. మొత్తం 75 మంది కాంగ్రెస్ ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు రాష్ట్రాల్లో కూడా అక్కడి పీసీసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
Read Also: Presidential Election Result: ముగిసిన ఎంపీ ఓట్ల లెక్కింపు.. ద్రౌపది ముర్ముకు 540 ఎంపీల ఓట్లు
నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే రాహుల్ గాంధీని విచారించింది ఈడీ. దాదాపుగా 50 గంటలకు పైగా రాహుల్ గాంధీని విచారించింది. అంతకుముందు నేషనల్ హెరాల్డ్ కేసులో మల్లికార్జున ఖర్గే, పవన్ బన్సల్ లను ఈడీ ఇప్పటికే విచారించింది. తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని విచారించడంపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కావాలనే బీజేపీ కేంద్ర సంస్థల్ని ఉపయోగించి ప్రతిపక్ష నేతలను ఇబ్బందులకు గురిచేస్తుందని విమర్శిస్తున్నారు.