Naresh Goyal: మనీలాండరింగ్ కేసులో మరో వ్యాపారవేత్త అరెస్టు అయ్యారు. బ్యాంకు నుంచి రుణం తీసుకొని చెల్లించకపోవడంతో జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు విచారణ జరిపి అనంతరం అరెస్ట్ చేశారు. కెనరా బ్యాంకును మోసంచేసిన కేసులో నరేష్ గోయల్ను ముంబైలోని ఈడీ ఆఫీస్లో శుక్రవారం సుదీర్ఘంగా ప్రశ్నించిన ఈడీ అధికారులు అనంతరం అదుపులోకి తీసుకున్నారు. శనివారం ఉదయం పీఎంఎల్ఏ కోర్టులో హాజరుపరుచనున్నారు. కేనరా బ్యాంకును రూ.538 కోట్ల మేర మోసం చేసినట్లు సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. మే 5న ముంబైలోని ఏడు ప్రాంతాల్లో సీబీఐ అధికారులు తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. మోసం, నేరపూరిత కుట్ర, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, నేరపూరిత దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని పేర్కొంటూ నరేశ్ గోయల్, అనితా గోయల్, గౌరంగ్ ఆనంద శెట్టి తదితరులపై గతేడాది నవంబర్ 11న సీబీఐకి కెనరా బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ పీ సంతోష్ ఫిర్యాదు చేశారు. దీనివల్ల బ్యాంకుకు రూ.538.62 కోట్ల నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Read Also: Prabhunath Singh: జంట హత్యల కేసు.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు.. మాజీ ఎంపీకి జీవిత ఖైదు
కెనరా బ్యాంకులో రూ.538 కోట్ల మోసానికి సంబంధించి జెట్ ఎయిర్వేస్, గోయల్, ఆయన భార్య అనిత, కొందరు మాజీ కంపెనీ ఎగ్జిక్యూటివ్లపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. జెట్ ఎయిర్వేస్ (ఇండియా) లిమిటెడ్ (జెఐఎల్) కు రూ .848.86 కోట్ల రుణ పరిమితులు, ణాలను మంజూరు చేసిందని, ఇందులో రూ .538.62 కోట్లు బకాయి ఉన్నాయని ఆరోపిస్తూ బ్యాంక్ చేసిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఖాతాను 2021 జూలైలో ‘మోసం’గా సీబీఐ ప్రకటించింది. మొత్తం కమీషన్ ఖర్చుల్లో సంబంధిత కంపెనీలకు రూ.1,410.41 కోట్లు చెల్లించినట్లు జేఐఎల్ ఫోరెన్సిక్ ఆడిట్ లో తేలిందని, తద్వారా జేఐఎల్ నుంచి నిధులను పక్కదారి పట్టించారని బ్యాంక్ ఆరోపించింది. జెట్ ఎయిర్వేస్ నేలకు పరిమితమైన తర్వాత 2019 మే 25న విదేశాలకు బయలుదేరి వెళ్లేందుకు నరేష్ గోయల్, ఆయన అనితా గోయల్ ప్రయత్నించారు. ముంబై విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు విమానం ఎక్కడానికి అనుమతి నిరాకరించారు. నరేశ్ గోయల్ దంపతులు నాలుగు భారీ సైజ్ సూట్ కేసులతో విదేశాలకు వెళ్లేందుకు సిద్ధం కావడం గమనార్హం. విదేశీ విమాన సర్వీసుల సంస్థ ‘ఎతిహాద్’కు వాటాల విక్రయ ఒప్పందం విషయంలో విదేశీ మారక ద్రవ్యం యాజమాన్య సంస్థ (ఫెమా) నిబంధనలను నరేష్ గోయల్ ఉల్లంఘించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. దీంతో ముంబై, ఢిల్లీల్లోని ఆయన నివాసాలు, కార్యాలయాలపై 2019 సెప్టెంబర్ లో తనిఖీలు చేశారు. 2020లో నరేశ్ గోయల్ని ఈడీ అధికారులు పలు దఫాలు ప్రశ్నించారు. దాదాపు 25 ఏండ్ల పాటు నిరంతరాయంగా విమాన సేవలు నిర్వహించిన జెట్ ఎయిర్వేస్.. భారీ నష్టాలతో.. సర్వీసుల నిర్వహణకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో విఫలం కావడంతో 2019 ఏప్రిల్లో మూత పడింది. తర్వాత బ్యాంకులు నిర్వహించిన వేలంలో జలాన్ కల్రాక్ కన్సార్టియం.. జెట్ ఎయిర్వేస్ సంస్థ బిడ్ సొంతం చేసుకున్నది. ఇంకా జలాన్ కల్ రాక్ కన్సార్టియం ఆధ్వర్యంలో జెట్ ఎయిర్వేస్ విమాన సర్వీసులు ప్రారంభం కావాల్సి ఉన్న విషయం తెలిసిందే.