దేశానికి ప్రధానమంత్రి అయినా ఆయన అమ్మకు కొడుకే. పిల్లలు ఎంత పెద్దవారైనా తల్లి ముందు చిన్నవారే. వారి చిన్నతనం ఆమెకు గుర్తుకువస్తూ వుంటుంది. అందుకే ఎప్పుడూ అంటుంటారు దేశానికి రాజైనా… తల్లికి కొడుకే. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం తర్వాత ప్రధాని మోడీ రెండు రోజులపాటు సొంత రాష్ట్రం గుజరాత్ కి వెళ్ళిన సంగతి తెలిసిందే. గుజరాత్ పర్యటనలో ఆయన తన తల్లిని హీరాబెన్ ని కలిశారు. ఆమెతో కలిసి భోజనం చేశారు. మాతృమూర్తి క్షేమసమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో అనేక సార్లు మోడీ తల్లిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.
అహ్మదాబాద్ విమానాశ్రయం చేరుకున్న ప్రధాని నరేంద్రమోడీకి బీజేపీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికాయి. భారీ రోడ్ షోలో లక్షలాది మంది కార్యకర్తలు పాల్గొని మోదీకి అభివాదం చేశారు. జై మోడీ, జై..జై మోడీ అన్న నినాదాలతో రహదారులు మోగిపోయాయి. పెన్ టాప్ వాహనంలో ప్రయాణిస్తూ దారి పొడవునా ప్రజలకు, కార్యకర్తలకు చేతులు ఊపుతూ మోడీ అభివాదం తెలిపారు.

మోడీలో ఉత్సాహం తొణికసలాడింది. ఎన్నికల్లో కమలం వికసించడంతో బీజేపీ నేతల ముఖారవిందాలు ఆనందం వెల్లివిరిసింది. గుజరాత్ లో పలు సంస్కృతిక కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొన్నారు. అనంతరం గాంధీ నగర్ శివారులోని రైసిన్ లో తన సోదరుడు పంకజ్ మోడీ నివాసానికి ప్రధాని నరేంద్రమోడీ వెళ్లారు.

అక్కడ ఉన్న తన తల్లి హీరాబెన్ పాదాలకు నమస్కరించారు. ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. తల్లితో కలిసి భోజనం చేశారు. ఇద్దరు కలిసి అనేక విషయాలు చర్చించుకున్నారు. త్వరలో జరగబోయే గుజరాత్ ఎన్నికలకు సంబంధించి మోడీ బీజేపీ శ్రేణుల్ని సమాయత్తం చేస్తున్నారు.
