మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం దాదాపుగా ముగిసినట్లే కనిపిస్తోంది. శివసేన రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే, బీజేపీ మద్దతుతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ ముఖ్యమంత్రి బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో చేరారు. అయితే నేడు( ఆదివారం) మహారాష్ట్ర స్పీకర్ ఎన్నికలు జరగబోతున్నాయి. జూలై 3, 4 తేదీల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. స్పీకర్ ఎన్నికతో పాటు జూలై 4న షిండే ప్రభుత్వం బలనిరూపణ పరీక్షను ఎదుర్కోబోతోంది.
గత ఏడాది కాలంగా మహారాష్ట్ర స్పీకర్ పోస్ట్ ఖాళీగా ఉంది. మహావికాస్ అఘాడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నేత నానా పటోలే స్పీకర్ గా ఎన్నికయ్యారు. అయితే ఆయన మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టడంతో ఆ పదవికి రాజీనామా చేశారు. తాజాగా బలపరీక్ష ముందు ఈ రోజు స్పీకర్ ను ఎన్నుకోనుంది మహారాష్ట్ర అసెంబ్లీ. ఇప్పటికే స్పీకర్ పదవి కోసం షిండే, బీజేపీ ప్రభుత్వం ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్ పేరును ప్రతిపాదించింది. నర్వేకర్ శుక్రవారం తన నామినేషన్ దాఖలు చేశాడు. ఇక శివసేన ఉద్ధవ్ వర్గం నుంచి ఎమ్మెల్యే రాజన్ సాల్వీ శనివారం నామినేషన్ దాఖలు చేశారు.
ఇదిలా ఉంటే మహారాష్ట్రలో అధికారం చేపట్టిన ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం సోమవారం బలనిరూపణ పరీక్షను ఎదుర్కోనుంది. శివసేనకు చెందిన 55 మంది ఎమ్మెల్యేలలో 39 మంది ఎమ్మెల్యేలతో పాటు ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో పాటు బీజేపీ, ఇతర స్వతంత్ర ఎమ్మెల్యేలతో 160కి పైగా మెజారిటీ తమకు ఉందని షిండే అన్నారు. దీంతో షిండే ప్రభుత్వం సులభంగానే బలనిరూపణలో నెగ్గే అవకాశం ఉంది.
నిన్న రాత్రి గోవాలో ఉన్న తన వర్గం ఎమ్మెల్యేలతో ముంబై చేరుకున్నారు సీఎం ఏక్ నాథ్ షిండే. సీఎంగా ఎన్నికైన తర్వాత తన వర్గాన్ని గోవాలో కలిసి మంతనాలు సాగించారు ఏక్ నాథ్ షిండే. తాజాగా వీరంతా ముంబై చేరుకున్న తరువాత శనివారం అర్థరాత్రి సీఎం ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించనట్లు తెలిసింది.