India won’t be coerced by anybody, Jaishankar’s message to Pakistan, China: భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ చైనా, పాకిస్తాన్ తీరును ఎండగట్టారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో మే 2020లో చైనా వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)పై యథాతథ స్థితిని ఏకపక్షంగా మర్చడానికి ప్రయత్నించిందని దీనికి భారత్ ధీటుగా, ధృడమైన సందేశాన్ని పంపిందని జైశంకర్ శనివారం అన్నారు. తుగ్లక్ పత్రిక 53వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ వద్ద కూడా చైనా ఇలాంటి దురాక్రమణకే ప్రయత్నించిందని అన్నారు. సరిహద్దు వెంబడి భారతబలగాలు అత్యంత తీవ్రమైన కఠిన పరిస్థితుల్లో సరిహద్దును కాపాడుతున్నారని ఆయన అన్నారు.
Read Also: Ukraine War: అంధకారంలో ఉక్రెయిన్.. రష్యా భీకరదాడి.. 12 మంది మృతి
భారతదేశాన్ని ఇప్పుడు ఎవరూ బలవంతం చేయలేరని.. జాతీయ భద్రత కోసం భారత్ ఏమి చేయాలో అది చేస్తుందని, ప్రపంచం కూడా భారత్ ను ఇలానే చూస్తోందని, చైనాను ఎదురించిన తీరును ప్రపంచం మొత్తం చూసిందని ఆయన అన్నారు. ఎల్ఏసీ పశ్చిమాన ఉన్న గాల్వాన్ లోయ, పాంగాంగ్ సరస్సు, అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్ మధ్య చైనా, భారత్ మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయని అన్నారు.
ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో భారతదేశం అభివృద్ధి చెందిందని జైశంకర్ ప్రశంసించారు. ఇది ప్రపంచవేదికపై భారత్ స్థాయిని పెంచిందని అన్నారు. ప్రపంచ ఎజెండాను రూపొందించే ప్రక్రియలో దాన్ని ప్రభావితం చేసే దేశంగా భారత్ మారిందని తెలిపారు. సీమాంతర ఉగ్రవాదంపై భారత ప్రభుత్వం ధృడంగా వ్యవహరిస్తోందని.. అందుకు ఉరీ, బాలాకోట్ దాడులే ఉదాహరణ అని అన్నారు. భారత్ తన కోసం, ప్రపంచం కోసం వ్యాక్సిన్ తయారు చేసిందని అన్నారు. ప్రపంచంలో 100 కన్నా ఎక్కువ దేశాలకు భారత్ వ్యాక్సిన్ సరఫరా చేసిందని తెలిపారు. 1947లో దేశ విభజన జరగకపోతే ప్రపంచంలో అతిపెద్ద దేశంగా భారత్ ఉండేదని.. చైనా కాదని ఆయన అన్నారు.