CM Pinarayi Vijayan: కేరళలో పాలక సీపీఎం, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా పాలస్తీనా సంఘీభావం ర్యాలీలను చేపడుతున్నాయి. శనివారం కోజికోడ్ వేదికగా అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పాలస్తీనా మద్దతు ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో కేరళ సీఎం పినరయి విజయన్ పాల్గొన్నారు.
ఈ ర్యాలీలో మాట్లాడిన విజయన్.. బీజేపీపై విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని బీజేపీ ఇజ్రాయిల్కి మద్దతు ఇచ్చే విధానాన్ని అవలంభిస్తోందని, బీజేపీ విధానాన్ని ఇండియా స్టాండ్గా పరిగణించొద్దని అన్నారు. మా సంఘీభావం పాలస్తీనా అనుకూలంగానే ఉంటుందని అన్నారు. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం మధ్య భారతదేశం పాలస్తీనాకు సంఘీభావంగా నిలిచిందని, ఇజ్రాయిల్కి మద్దతు ఇవ్వడం పాలక బీజేపీ విధానంలో భాగమని కేరళ సీఎం పేర్కొన్నారు.
పాలస్తీనాకు వ్యతిరేకంగా ఇజ్రాయిల్ భారత్ ను ఆయుధంగా వాడుకుంటోందని, ఇజ్రాయిల్తో సైనిక, రక్షణ ఒప్పందాలను భారత్ నిలిపేయాలని సీఎం విజయన్ డిమాండ్ చేశారు. స్వాతంత్య్రానికి పూర్వం, ఆ తరువాత కాలంలో భారత్ పాలస్తీనాకు మద్దతు ఇచ్చిందని, పీవీ నరసింహరావు ప్రధానిగా ఉన్న సమయంలో ఇజ్రాయిల్ని మనం గుర్తించడం ప్రారంభించామని, అమెరికాతో ఉన్న స్నేహం ప్రభావం చూపిందని వివరించారు. నెహ్రూ కూడా పాలస్తీనా అనుకూల విధానాన్ని కొనసాగించారని గుర్తు చేశారు.
Read Also: Kalidas Jayaram: పెళ్లికి సిద్ధమైన విక్రమ్ నటుడు.. సైలెంటుగా షాకిచ్చాడుగా!
కాంగ్రెస్ పేరు చెప్పకుండా.. దేశంలో బలమైన ప్రభావం ఉందని చెప్పుకునే కొన్ని రాజకీయ పార్టీలు పాలస్తీనా అనుకూల నిరసనల్లో పాల్గొనడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. మన దేశంలో చాలా చోట్ల పాలస్తీనా అనుకూల ర్యాలీలను చూశామని, ఎక్కువగా వామపక్షాలే వీటిని నిర్వహించాని, అయితే దేశంలో బలమైన ప్రభావం ఉందని చెప్పుకునే పార్టీ ఎక్కడ ఉంది..? అని ప్రశ్నించారు. కేరళలో మాత్రం వారి వైఖరి వేరేలా ఉంటుందని కాంగ్రెస్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
అక్టోబర్ 29న ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపత్యంలో గాజాస్ట్రిప్తో మానవతావాద సంధికి పిలుపునిచ్చే తీర్మానంపై ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఓటింగ్కి భారత్ గైర్హాజరు కావడాన్ని పినరయి విజయన్ తప్పుపట్టారు. ఇజ్రాయిల్ కి మద్దతు ఇవ్వడం అంటే సొంత భూమి కోసం పోరాడుతున్న పాలస్తీనియన్లకు విధానాన్ని ఉల్లంఘించడమే అని అన్నారు.