Bengal BJP: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కన్నా ఒక్క సీటు ఎక్కువ వచ్చినా 2026 లోపే మమతా బెనర్జీ సర్కార్ పడిపోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) బెంగాల్ బీజేపీకి సైద్ధాంతిక అంశమని అన్నారు. రాష్ట్రంలో ఎంపీ స్థానాలను స్వీప్ చేయడానికి ఈ చట్టం సహాయపడుతుందని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో అవినీతి, అరాచక టీఎంసీని ఓడించాలని రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకున్నారని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మజుందార్ అన్నారు.
Read Also: Family Suicide Case: ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. ఈ కేసులో పోలీసులు ఏమన్నారంటే?
బెంగాల్లోని 42 ఎంపీ స్థానాలకు 35 సీట్లలో గెలవాలని బీజేపీ టార్గెట్ పెట్టుకున్నట్లు తెలిపారు. 2026 పదవీ కాలం పూర్తి కాకముందే టీఎంసీ ప్రభుత్వం పడిపోతుందని, దీనికి వంశరాజకీయాలు కారణమని అన్నారు. మహారాష్ట్రలో శివసేన- ఏన్సీపీ- కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడానికి బీజేపీ కారణం కాదని, ఉద్ధవ్ ఠాక్రేకి తన కొడుకుపై ఉన్న ప్రేమ, శరద్ పవార్కి తన కూతురు సుప్రియా సూలేపై ఉన్న ప్రేమే కారణమని అన్నారు. వారి కుటుంబ రాజకీయాలే పతనానికి కారణమని అన్నారు. బెంగాల్లో కూడా మమతా బెనర్జీకి అల్లుడు అభిషేక్ బెనర్జీపై ఉన్న ప్రేమ దెబ్బతీస్తుందని చెప్పారు.
294 మంది ఎమ్మెల్యేలు ఉన్న రాష్ట్ర శాసనసభలో బీజేపీకి 74 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. టీఎంసీకి 217 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సీఏఏపై మాట్లాడుతూ.. బంగ్లాదేశ్లో హింసించబడిన హిందువుకు ఈ చట్టం పెద్ద ఉపశమనం అని ఆయన అన్నారు. చాలా కాలంగా రాష్ట్రంలో ఉంటున్న బంగ్లాదేశ్ నుంచి వచ్చిన బెంగాలీ హిందువులను రక్షించడమే సీఏఏ లక్ష్యమని అన్నారు. సీఏఏపై బెంగాల్ మైనారిటీల్లో భయాందోళన సృష్టించడానికి టీఎంసీ ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. ఈసారి ముస్లింలు కూడా టీఎంసీ సిద్ధాంతాలను నమ్మరని ఆయన ధీమా వ్యక్తం చేశారు.