Sukhoi Crash: గురువారం అస్సాంలోని కర్బీ ఆంగ్లాంగ్లో భారత వైమానిక దళం సుఖోయ్ Su-30 MKI ఫైటర్ జెట్ కూలిపోవడంతో ఇద్దరు పైలట్లు మరణించారు. మరణించిన వారిలో ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేష్ దురాగ్కర్ ఉన్నారు. గతేడాది పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ పాకిస్తాన్పై ‘‘ఆపరేషన్ సిందూర్’’లో దురాగ్కర్ పాల్గొన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దుర్ఘటనలో భారత వైమానికదళం అత్యుత్తమ పైలట్ను కోల్పోయింది.
28 ఏళ్ల దురాగ్కర్ 10 రోజుల క్రితమే కుటుంబ సభ్యుల్ని కలిశారు. తన కొడుకు ఆపరేషన్ సిందూర్లో భాగమని మొదట తెలియదని, ఈ ఆపరేషన్ జరిగిన 15 రోజుల తర్వాత తెలిసిందని ఆయన తండ్రి రవీంద్ర దురాగ్కర్ అన్నారు. తన కొడుకు వైమానిక దళంలో భాగమైనందుకు గర్వంగా ఉందని, యుద్ధవిమానాల గురించి తనకు చెప్పేవాడని కన్నీంటిపర్యంతమయ్యారు. తన కొడుకు తన కలను సాధించారని, కానీ కోరుకున్నంత కాలం దేశానికి సేవ చేయలేకపోయారని అన్నారు.
Read Also: Anuj Agnihotri: యూపీఎస్సీ 2025 టాపర్గా నిలిచిన డాక్టర్ అనుజ్ అగ్నిహోత్రి! ప్రస్థానం ఇదే..
ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేష్,స్క్వాడ్రన్ లీడర్ అనుజ్ Su-30 MKIలో శిక్షణా కార్యక్రమంలో ఉండగా, అది జోర్హాట్ వైమానిక స్థావరం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అదృశ్యమైంది. టేకాఫ్ ప్రాంతం నుంచి 60 కి.మీ దూరంలో విమానం కుప్పకూలింది.
పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (LeT) ప్రతినిధి ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారతదేశం మే 7న ఆపరేషన్ సిందూర్ను ప్రారంభించింది. పాకిస్తాన్, పీఓకేలోని అనేక ఉగ్రవాద శిబిరాలపై భద్రతా దళాలు దాడి చేసి 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చాయి. దీని తర్వాత పాక్ సైన్యం జరిపిన దాడుల్ని కూడా భారత వైమానిక దళం సమర్థవంతంగా తిప్పికొట్టింది.