Anuj Agnihotri: కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) 2025 తుది ఫలితాలను ఈరోజు (మార్చి 6, 2026) ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక పరీక్షలో రాజస్థాన్కు చెందిన అనుజ్ అగ్నిహోత్రి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించి టాపర్గా నిలిచారు. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్లు upsc.gov.in లేదా upsconline.nic.in లో చూసుకోవచ్చు.
READ ALSO: Urea Distribution: యూరియా పంపిణీ యాప్లో కీలక మార్పులు.. ఇక సులభంగా..
ఎవరీ అనుజ్ అగ్నిహోత్రి?
డాక్టర్ అనుజ్ అగ్నిహోత్రి ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం. ఆయన రాజస్థాన్లోని రావత్భట నివాసి. ఆయన తండ్రి కేబీ అగ్నిహోత్రి రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్లో పనిచేస్తున్నారు. రావత్భటలోని కేంద్రీయ విద్యాలయంలో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన అనుజ్, ఆ తర్వాత జోధ్పూర్ ఎయిమ్స్ (AIIMS) నుంచి 2023లో MBBS పూర్తి చేశారు. 2023లోనే సివిల్స్ క్లియర్ చేసిన అనుజ్, ప్రస్తుతం డానిక్స్ (DANICS) సర్వీస్లో పనిచేస్తున్నారు. అయితే ఐఏఎస్ సాధించాలనే లక్ష్యంతో మళ్లీ పరీక్ష రాసి, ఈసారి ఏకంగా దేశంలోనే నంబర్ వన్ ర్యాంక్ కైవసం చేసుకున్నారు.
యూపీఎస్సీ పరీక్షా విధానం ఇదే..
సివిల్ సర్వీసెస్ పరీక్ష మూడు కీలక దశల్లో జరుగుతుంది.
ప్రిలిమ్స్ (Prelims): ఇది మొదటి వడపోత దశ. ఇందులో జనరల్ స్టడీస్, CSAT అనే రెండు పేపర్లు ఉంటాయి.
మెయిన్స్ (Mains): ప్రిలిమ్స్లో అర్హత సాధించిన వారికి 2025 ఆగస్టులో రాత పరీక్ష నిర్వహించారు. ఇందులో వ్యాసం, నాలుగు జనరల్ స్టడీస్ పేపర్లు, ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటాయి.
ఇంటర్వ్యూ (Personality Test): మెయిన్స్లో ఉత్తీర్ణులైన వారికి 2026 ఫిబ్రవరిలో ముఖాముఖి పరీక్ష నిర్వహించారు. అభ్యర్థి వ్యక్తిత్వం, నిర్ణయాధికారం, సమాజం పట్ల అవగాహనను ఇక్కడ పరీక్షిస్తారు.
ఈ పరీక్షలో విజయం సాధించిన 958 మంది అభ్యర్థులు ఐఏఎస్ (IAS), ఐపీఎస్ (IPS), ఐఎఫ్ఎస్ (IFS) వంటి ప్రతిష్టాత్మక సర్వీసుల్లో చేరి దేశ పరిపాలనలో కీలక పాత్ర పోషించనున్నారు. డాక్టర్ నుంచి ఐఏఎస్ టాపర్గా ఎదిగిన అనుజ్ అగ్నిహోత్రిపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.
READ ALSO: Jasprit Bumrah: ‘యార్కర్ కింగ్’ బుమ్రా సక్సెస్ వెనుక ఉన్న గురువు ఇతనే!