అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం.. మళ్లీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి.. గతంలో పార్టీకి దూరమైనవారు కూడా తిరిగి టీఎంసీ గూటికి చేరుతున్నారు.. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సుస్మితా దేవ్.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సుత్మితా దేవ్.. టీఎంసీ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, డెరిక్ ఒబ్రెయిన్ సమక్షంలో టీఎంసీ కండువా కప్పుకున్నారు.
మరోవైపు.. ఈ పరిణామానికి ముందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాశారు సుస్మితా దేవ్.. తాను పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు.. పార్టీతో తనకు మూడు దశాబ్దాల అనుబంధం ఉందన్న ఆమె… అందుకు నేతలు, సభ్యులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానని తెలిపారు.. తన మార్గదర్శకత్వం వహిస్తూ, పలు అవకాశాలు ఇచ్చినందుకు సోనియాగాంధీకి వ్యక్తిగతంగా కూడా కృతజ్ఞతలు తెలియజేశారు సుస్మితా దేవ్. కాగా, సుశ్మితాదేవ్ 2014 సాధారణ ఎన్నికల్లో అసోంలోని సిల్చార్ స్థానం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత పార్టీ ఆమను ఆలిండియా మహిళా విభాగం అధ్యక్షురాలిగా కూడా నియమించింది. అయితే, సుష్మితాదేవ్ పార్టీ నుంచి వైదొలగడంతో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలినట్టు అయ్యింది.