Kiren Rijiju: దేశ ప్రజలను విభజించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశ ఐక్యతకు అత్యంత ప్రమాదకరమని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్రమోదీని విమర్శిస్తూ రాహుల్ గాంధీ ఇటీవల లండన్లో చేసిన వ్యాఖ్యలపై రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘స్వయం ప్రకటిత కాంగ్రెస్ యువరాజు అన్ని పరిమితులను దాటారు. భారత ప్రజలకు రాహుల్ గాంధీ ‘‘పప్పు’’ అని తెలుసు, కానీ విదేశీయులకు పప్పు అని తెలియదు. అతని మూర్ఖపు ప్రకటనలపై స్పందించాల్సిన అవసరం లేదు. కానీ సమస్య ఏంటంటే అతడు భారతదేశ వ్యతిరేఖ ప్రకటనలతో, భారత ప్రతిష్ట దెబ్బతీసేలా, భారత వ్యతిరేఖ శక్తులను వినియోగిస్తున్నారు’’ అంటూ ట్వీట్ చేశారు.
Read Also: Tragedy: ఆడపిల్లగా పుట్టడమే తాను చేసిన నేరమా.. అప్పుడు వేధింపులు.. ఇప్పుడు దాడులు
కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రసంగించిన రాహుల్ గాంధీ.. బీజేపీ ప్రజాస్వామ్య సంస్థలను నాశనం చేసిందని విమర్శించారు. దీంతో పాటు పార్లమెంట్ లో తరుచుగా మైకులు స్విచ్ ఆఫ్ అవుతాయని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఈ వ్యాఖ్యలపై కూడా రిజిజు తీవ్రంగానే స్పందించారు. రాహుల్ గాంధీతో పాటు మరికొంత మంది నేతలు తెల్లవారినప్పటి నుంచి రాత్రి వరకు ప్రభుత్వాన్ని , ప్రధాని మోదీని తిడుతూనే ఉంటారని ఆరోపించారు. రాహుల్ వ్యాఖ్యలపై రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్దారు. ఆయన వ్యాఖ్యలు పూర్తిగా అబద్దహని, నిరాధారమని అన్నారు.
పార్లమెంట్ లో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని, ఇందులో భాగంగానే బీబీసీ కార్యాలయాలపై దాడులు చేశారని భారతదేశం ప్రశ్నించకుండా ఉండాలని బీజేపీ కోరుకుంటోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. భావవ్యక్తీకరణ, ప్రశ్నించేందుకే యాత్ర చేశానని ఆయన అన్నారు. బీబీసీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయడం మానేస్తే అన్ని కేసులు మాయమవుతాయని అన్నారు. భారతదేశంలో దళితులు, అట్టడుగు కులాలు, ఆదివాసీలు, మీడియా గొంతు ఎత్తవద్దని బీజేపీ కోరుకుంటోందని, దేశంలోని సంపదను ఇద్దరు, ముగ్గురు వ్యక్తలకే అప్పగిస్తున్నారంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు.