మహారాష్ట్రలో గత వారం రోజులుగా కొనసాగుతున్న నాటకీయ పరిణామాలకు తెరదించుతూ ఆ రాష్ట్రంలో భాజపా సర్కారు కొలువుదీరనుంది. ముఖ్యమంత్రి పదవిని ఏక్నాథ్ షిండేకు కేటాయిస్తూ భాజపా సంచలన నిర్ణయం తీసుకుంది. ఉద్ధవ్ ఠాక్రే రాజీనామాతో రాష్ట్రంలో సర్కారు కుప్పకూలగా.. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా ఉన్న ఉన్న భాజపాకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం లభించింది. ఈ నేపథ్యంలోనే శివసేన రెబల్ నేత ఏక్నాథ్ షిండేతో కలిసి గవర్నర్ ను కలిశారు మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. ముఖ్యమంత్రి పదవిని రెబల్ నేతకే అప్పగించారు. ఇవాళ సాయంత్రం 7గంటలకు ఏక్నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
మహారాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే గురువారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో గోవా నుంచి ముంబై చేరుకున్నారు. ముంబై చేరిన ఏక్నాథ్ షిండే తొలుత బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో భేటీ అయ్యారు. అనంతరం ఇద్దరు కలిసి రాజ్భవన్లో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీని కలిశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు గురించి చర్చించారు.
ఈ నేపథ్యంలో దేవేంద్ర ఫడ్నవీస్ మరో సంచలన వార్త చెప్పారు. తాను ప్రభుత్వానికి దూరంగా ఉండనున్నట్లు వెల్లడించారు. షిండే నేతృత్వంలో శివసేన ప్రభుత్వం కొలువుదీరనుందని ఆయన ప్రకటించారు. అంతేకాకుండా తాము షిండే ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇస్తామని, ప్రభుత్వంలో చేరబోమని ప్రకటించారు. షిండే ప్రభుత్వాన్ని నిలబెట్టే బాధ్యత తమదేనని కూడా ఫడ్నవీస్ మరో కీలక ప్రకటన చేశారు. వెరసి మహారాష్ట్ర తదుపరి సీఎం ఫడ్నవీసేనన్న అందరి అంచనాలను ఆయన తలకిందులు చేసేశారు. ఫడ్నవీస్ ప్రకటనకు ముందే… షిండేను శివసేన శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నట్లుగా ఓ ప్రకటన వెలువడింది.