Cash-for-Query Case: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాకు ఢిల్లీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ‘క్యాష్ ఫర్ క్వెరీ’ కేసులో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు సీబీఐకి అనుమతి ఇచ్చిన లోక్పాల్ ఆదేశాలను న్యాయస్థానం రద్దు చేసింది. జస్టిస్ అనిల్ క్షేతర్పాల్, జస్టిస్ హరీష్ వైద్యనాథన్ శంకర్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ.. లోక్పాల్ మళ్లీ ఈ అంశాన్ని పునఃపరిశీలించాలని ఆదేశించింది. లోక్పాల్ అండ్ లోకాయుక్తాస్ చట్టంలోని సెక్షన్ 20 ప్రకారం సంబంధిత నిబంధనలను అనుసరించి, నెల రోజుల్లో అనుమతి అంశంపై తాజా నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
Read Also: Aindrita Ray: ఇంట్లో ఊపిరాడడం లేదు.. చెత్తకుప్పలు తగలబెట్టడంపై నటి ఆవేదన
అయితే, ఈ కేసులో వ్యాపారవేత్త దర్శన్ హిరానందానీ నుంచి నగదు, బహుమతులు తీసుకుని లోక్సభలో ప్రశ్నలు అడిగారనే ఆరోపణలు మహువా మొయిత్రాపై ఉన్నాయి. లోక్పాల్ అనుసరించిన విధానంలో స్పష్టమైన లోపాలున్నాయని మొయిత్రా తరఫు న్యాయవాది వాదించారు. సెక్షన్ 20(7) ప్రకారం అనుమతి ఇచ్చే ముందు ప్రజాసేవకుడి వ్యాఖ్యలను తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, సీబీఐ మాత్రం లోక్పాల్ విచారణలో మొయిత్రాకు పత్రాలు సమర్పించే హక్కు లేదని, కేవలం వ్యాఖ్యలు మాత్రమే ఇవ్వవచ్చని, మౌఖిక విచారణకు కూడా హక్కు లేదని వాదించింది.
Read Also: Srisailam: మల్లన్న భక్తులకు గుడ్న్యూస్.. శ్రీశైలంలో స్పర్శ దర్శనాలపై కీలక నిర్ణయం
ఇక, ఈ వ్యవహారం తుది నిర్ణయం వచ్చే వరకు ఛార్జ్షీట్ దాఖలు చేయడం సహా ఎలాంటి తదుపరి చర్యలు చేపట్టకుండా సీబీఐని ఆపాలని ఎంపీ మొయిత్రా కోర్టును కోరింది. ఈ కేసులో భాగంగా సీబీఐ గత జూలైలో లోక్పాల్కు తన నివేదికను సమర్పించింది. లోక్పాల్ సూచనలతోనే మార్చి 21, 2024న అవినీతి నిరోధక చట్టం కింద మహువా మొయిత్రా, దర్శన్ హిరానందానీపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. అయితే, సీబీఐ ఆరోపణల ప్రకారం, లోక్సభ లాగిన్ వివరాలను హిరానందానీకి షేర్ చేసి, తన పార్లమెంటరీ హక్కులను ఉల్లంఘించి, జాతీయ భద్రతకు ముప్పు తెచ్చేలా వ్యవహరించినందుకు ప్రతిఫలంగా ఆమె లంచాలు తీసుకున్నట్లు పేర్కొంది.