Brahmastra: బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త-పార్ట్ 1’పై అంచనాలు భారీగా ఉన్నాయి. తెలుగులో ఈ మూవీని ప్రముఖ దర్శకుడు రాజమౌళి సమర్పిస్తున్నాడు. రణబీర్ పూర్, అలియా భట్ జంటగా నటించిన ఈ మూవీ సెప్టెంబరు 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. అయితే రిలీజ్కు ముందే ఈ చిత్రం పలు వెబ్ సైట్లలో స్ట్రీమింగ్ అవుతుండటం చిత్రబృందాన్ని ఒక్కసారిగా షాక్కు గురి చేసింది. దీనిపై స్టార్ ఇండియా సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ‘బ్రహ్మాస్త్ర’ చిత్రాన్ని అనధికారికంగా స్ట్రీమింగ్ చేస్తున్న 18 వెబ్ సైట్లను హైకోర్టు బ్లాక్ చేసింది.
Read Also: జీవిత భాగస్వామిని వెతుకుతున్నారా.. ఈ విషయాలను పట్టించుకోవద్దు..
ఓ సినిమాను తొలుత థియేటర్లలో విడుదల చేయడం, ఆ తర్వాత వివిధ వేదికలపై ప్రదర్శించేందుకు అనుమతించడం జరుగుతుందని స్టార్ ఇండియా సంస్థ కోర్టుకు వివరించింది. ఓ సినిమాకు థియేట్రికల్ రిలీజ్ అనేది వ్యాపారపరంగా ఎంతో ముఖ్యమైన దశ అని తెలిపింది. అయితే కొన్ని దుర్మార్గపు వెబ్ సైట్లు అక్రమార్జన కోసం చిత్రాలకు సంబంధించిన కాపీలను సంపాదించి అక్రమ రీతిలో స్ట్రీమింగ్ చేస్తున్నాయని స్టార్ ఇండియా ఆరోపించింది.
దీంతో బ్రహ్మాస్త్ర మూవీకి సంబంధించిన కంటెంట్ కలిగి ఉండటం, స్ట్రీమింగ్ చేయడం, ప్రదర్శించడం, డౌన్లోడింగ్కు చేయడానికి వీలుగా కంటెంట్ను అందుబాటులో ఉంచడం, అప్ లోడ్ చేయడం, నవీకరించడం, మార్పులు చేర్పులతో ప్రసారం చేయడం, ఇంటర్నెట్ ద్వారా, మరే ఇతర వేదిక ద్వారా వెబ్ సైట్లు షేర్ చేయడం అనేది హక్కులను ఉల్లంఘించడమేనని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు 18 వెబ్ సైట్లను గుర్తించి బ్లాక్ చేసింది. తదుపరి విచారణ వరకు తమ ఆదేశాలు అమల్లో ఉంటాయని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. మరోవైపు కేంద్ర టెలీకమ్యూనికేషన్స్ విభాగానికి, కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖకు కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హక్కులను ఉల్లంఘించిన వెబ్ సైట్లకు అనుమతి నిరాకరించేలా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు స్పష్టం చేయాలని కేంద్రానికి సూచించింది. పైరసీని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించలేదని, పైరసీ ఎక్కడున్నా ఉక్కుపాదంతో అణచివేయాలని ఢిల్లీ హై కోర్టు స్పష్టం చేసింది.