ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి తర్వాత పంజాబ్ ప్రభుత్వం అప్రమత్తం అయినట్లు తెలుస్తోంది. 2027లోనే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం పంజాబ్లోనే ఆప్ ప్రభుత్వం ఉంది. ఇక్కడ అధికారాన్ని నిలబెట్టుకుంటేనే పార్టీ మనుగడ సాగుతోంది. లేదంటే పార్టీ పరిస్థితి దారుణంగా తయారయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా రేపు (మంగళవారం) ఆప్ అధినేత కేజ్రీవాల్ను పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్తో సహా కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు కలవనున్నారు. ఈ సందర్భంగా 2027లో జరగబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను ఎలా ఎదుర్కొవాలన్న అంశంపై కేజ్రీవాల్ దిశానిర్దేశం చేయనున్నారు. ఢిల్లీలో ఎదురైన పరిస్థితుల గురించి కూడా చర్చించనున్నారు.
ఇది కూడా చదవండి: Supreme Court: ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసును వాయిదా వేసిన సుప్రీంకోర్టు
ఇదిలా ఉంటే పంజాబ్ కాంగ్రెస్ నాయకుడు ప్రతాప్ సింగ్ బజ్వా మాట్లాడుతూ.. పంజాబ్లో 30 మంది ఆప్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారని.. వారంతా పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని బాంబ్ పేల్చారు. ఢిల్లీలో ఆప్ ఓటమి తర్వాత కూడా కాంగ్రెస టార్గెట్ చేసుకున్నట్లుగానే కనిపిస్తోంది. ఇరు పార్టీల మధ్య వార్ చల్లారలేదు. మోసం, అబద్ధాలు, నెరవేర్చలేని వాగ్దానాలతో పాలన ముగిసిందంటూ ఆప్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా పంజాబ్లో వాగ్దానాలు అమలు చేయడంలో ఆప్ విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలను ఆప్ సీరియస్గా చూస్తోంది. ఈ వ్యాఖ్యలపై కూడా రేపటి కేజ్రీవాల్ సమావేశంలో చర్చకు రానున్నాయి.
ఇది కూడా చదవండి: Rupee All time Low : డోనాల్డ్ ట్రంప్ టారిఫ్ యుద్ధం.. రికార్డు స్థాయికి పడిపోయిన రూపాయి
ఫిబ్రవరి 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో బీజేపీ అధికారం చేజిక్కించుకుంది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇక ఆప్లో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లాంటి రాజకీయ ఉద్దండులంతా ఓడిపోయారు. మాజీ ముఖ్యమంత్రి అతిషి మాత్రమే కల్కాజీ నియోజకవర్గం నుంచి స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. లిక్కర్ స్కామ్, శేష్ మహల్ అంశం ఆప్ను ఘోరంగా దెబ్బకొట్టింది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బీజేపీ 48, ఆప్ 22 స్థానాలు గెలుచుకుంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. పంజాబ్లో కూడా కాంగ్రెస్, ఆప్ వేర్వేరుగానే పోటీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Mahesh Kumar: ఫాం హౌస్కే పరిమితమైన కేసీఆర్కి ప్రతిపక్ష హోదా ఎందుకు: టీపీసీసీ అధ్యక్షుడు