ఇండియాలో కరోనా కేసుల పెరుగుదల అలాగే ఉంది. ప్రతీ రోజు 15 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ఇటీవల కాలంలో అన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరిగింది. ముఖ్యంగా బెంగాల్, ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో ఫోర్త్ వేవ్ వస్తుందా..? అనే భయాల్లో ప్రజలు ఉన్నారు. మరోవైపు మరణాల సంఖ్య అదుపులోనే ఉంది. వ్యాక్సినేషన్ కార్యక్రమం ద్వారా మరణాలను గణనీయంగా అదుపు చేయగలుగుతున్నాము.
గడిచిన 24 గంటల్లో ఇండియాలో 16,678 కేసులు నమోదు అయ్యాయి. 26 మంది మహమ్మారి బారినపడి చనిపోయారు. మొత్తం 14,629 మంది కోవిడ్ బారి నుంచి రికవరీ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 1,30,713 కేసులు ఉన్నాయి. ఇదిలా ఉంటే డెయిలీ పాజిటివిటీ రేటు క్రమంగా పెరుగుతోంది. గత వారం 4కు పరిమితమైన పాజిటివిటీ రేటు ప్రస్తుతం 5.99 శాతంగా ఉంది. కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి ఇండియాలో ఇప్పటి వరకు మొత్తం 4,36,39,329 కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 4,29,83,162 మంది కోలుకుంటే.. 5,25,454 మంది మరణించారు.
Read Also: Chennai: అన్నాడీఎంకే కార్యాలయంలో పన్నీర్, పళని వర్గాల మధ్య డిష్యుం డిష్యుం
దేశంలో ప్రస్తుతం వ్యాక్సినేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 198,88,77,537 డోసుల టీకాలు ఇచ్చారు. గడిచిన రోజులో 11,44,145 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. 24 గంటల్లో దేశంలో మొత్తంగా 2,78,266 మందికి కరోనా పరీక్షలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే 56,06,54,133 మంది కరోనా బారిన పడితే..63,73,019 మంది మరణించారు.